Monday, April 29, 2024

కోహ్లి సేన అదరహో..

- Advertisement -
- Advertisement -

India win second Test against England

చెలరేగిన సిరాజ్, రాణించిన బుమ్రా, షమి, లార్డ్ టెస్టులో ఇంగ్లండ్ చిత్తు, భారత్ ఘన విజయం

లండన్: ఇంగ్లండ్‌తో చారిత్రక లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. దీన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లండ్ టీమ్ భారత బౌలర్ల ధాటికి ఎదురునిలువలేక 51.5 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు రోరి బర్న్ (౦), డొమినిక్ సిబ్లే (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హసీబ్ హమీద్ (9) కూడా నిరాశ పరిచాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జో రూట్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు.

ఐదు ఫోర్లతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో (2) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. మరోవైపు వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే కీలక సమయంలో హైదరాబాది మహ్మద్ సిరాజ్ బట్లర్‌తో సహా కీలక వికెట్లను తీసి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను తీసిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అన్నే వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు రెండు, ఇషాంత్‌కు రెండు వికెట్లు లభించాయి. షమి ఒక వికెట్ పడగొట్టాడు.

ఆరంభంలోనే..

అంతకుముందు 181/6 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ఆరంభించిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. జట్టును ఆదుకుంటాడని భావించిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టాడు. పంత్ 46 బంతుల్లో ఒక ఫోర్‌తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. కొద్ది సేపటికే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 209 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ కూడా వెనుదిరిగాడు. 24 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇషాంత్‌ను రాబిన్సన్ వెనక్కి పంపాడు. పంత్‌ను కూడా రాబిన్సనే ఔట్ చేయడం గమనార్హం. ఇద్దరు కీలక ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమేనని అందరూ ఊహించారు.

షమి, బుమ్రా చారిత్రక బ్యాటింగ్

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జస్‌ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి తమపై వేసుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లతో విరుచుకుపడుతున్నా వీరిద్దరూ ఏ మాత్రం అధైర్య పడకుండా క్రీజులో పాతుకు పోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ బౌన్సర్ బుమ్రా హెల్మెట్‌కు బలంగా తాకింది. అయితే బుమ్రా మాత్రం ప్రత్యర్థి బౌలర్ల దాడులను తేలిగ్గా తీసుకున్నాడు. తన కెరీర్‌లోనే చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. షమి కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇటు బుమ్రా, అటు షమి కుదరు కోవడంతో పరుగులు సులువుగా వచ్చాయి. అంతకంతకు భారత ఆధిక్యం పెరుగుతూ పోయింది.

ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భోజన విరామానికి ముందు షమి జోరును పెంచాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. అప్పటి వరకు సింగిల్స్‌కే పరిమితమైన షమి వరుస ఫోర్లతో అలరించాడు. బుమ్రా అతనికి సహకారం అందించాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ ఆధిక్యం 250 పరుగులు దాటింగింది. లంచ్ సమయానికి భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 286 పరుగులకు చేరింది. ఇక రెండో సెషన్ ప్రారంభమైన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. అప్పటికీ బుమ్రా 70 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్సర్‌తో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బుమ్రా 64 బంతుల్లో మూడు ఫోర్లతో అజేయంగా 34 పరుగులు సాధించాడు. దీంతో 298/8 వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News