భారత సైన్యానికి చిక్కిన పాక్ ఉగ్రవాది వేడుకోలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీరుకు చెందిన ఉరి సెక్టార్లో ఎదురుకాల్పుల సందర్భంగా భారత సైన్యం చేతికి సజీవంగా చిక్కిన పాకిస్తానీ ఉగ్రవాది ఒకడు తనను తన మాతృదేశానికి తిరిగి తీసుకువెళ్లాలంటూ తనను భారత్కు పంపించిన ఉగ్రసంస్థలను వేడుకున్నాడు. తనను ఇక్కడకు(భారత్) పంపించినట్లుగానే తిరిగి తన దేశానికి తిరిగి తీసుకువెళ్లాలంటూ లష్కరే తొయిబా ఏరియా కమాండర్కు, ఐఎస్ఐకి, పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్కు చెందిన అలీ బాబర్ పత్రా అనే యువ ఉగ్రవాది అర్థించాడు. అతని వీడియో సందేశాన్ని భారత సైన్యం బుధవారం నాడిక్కడ విడుదల చేసింది. ఈ నెల 26న ఉరి సెక్టార్లో భారత సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుండగా పాక్ ఉగ్రవాది పాత్ర భారత సైన్యానికి సజీవంగా చిక్కాడు. ఈ ఎదురుకాల్పులలో మరో పాకిస్తానీ చొరబాటుదారుడు మరణించాడు. కశ్మీరులో పరిస్థితి గురించి పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తొయిబా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని పత్ర తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. భారత సైన్యం ఇక్కడ రక్తపాతం సృష్టిస్తోందని తమకు అక్కడ చెప్పారని, కాని ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉందని, తనను భారత సైన్యం బాగా చూసుకుంటోందని తన తల్లికి తాను చెప్పదలచుకున్నానని అతను అన్నాడు.