పంజాబ్, హర్యానా, యుపి,రాజస్థాన్లపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ/చండీగఢ్/జైపూర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) ఇచ్చిన రైల్రోకో పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 160 రైళ్లకు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపూర్ఖేరీలో రైతులపై జరిగిన హింసకు నిరసనగా ఎస్కెఎం సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల రైల్రోకోకు పిలుపునిచ్చింది. రైల్రోకో ప్రభావం పంజాబ్, హర్యానా,ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్పై బలంగా చూపింది. ఉత్తర రైల్వేజోన్లోని 150 చోట్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ ప్రాంతాల్లో వెళ్లే 60 రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాంతో, ప్రయాణికులు తమ లగేజీతో రైల్వే స్టేషన్లలో గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. వాయువ్య రైల్వేజోన్లోని రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలపైనా రైల్రోకో ప్రభావం చూపింది. ఆ మార్గాల్లో 18రైళ్లను పూర్తిగా,10 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
రైతులు పలు చోట్ల రైల్ పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్లోని లూధియానా, అమృత్సర్,జలంధర్, మోగా,పాటియాలా, ఫిరోజ్పూర్..హర్యానాలోని చార్కీదాద్రీ, సోనీపత్, కురుక్షేత్ర,జింద్,కమల్,హిసార్ల్లో రైతులు రైల్రోకో చేపట్టి నిరసన తెలిపారు. యుపిలోని ముజఫర్నగర్లో రైల్ ట్రాక్లపై రైతులు ధర్నాకు దిగడంతో అమృత్సర్ఢిల్లీ, జలంధర్ ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాన్ని మార్చారు. మీరట్, గ్రేటర్ నోయిడాలోని దన్కర్లోనూ రైళ్ల సమయాలను మార్చారు.
లఖీంపూర్ఖేరీ హింసాకాండకు కారకుడని ఆరోపణలున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి,అరెస్ట్ చేయాలని ఎస్కెఎం డిమాండ్ చేస్తోంది. లఖీంపూర్ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాకు చెందిన వాహనశ్రేణి దూసుకువెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆగ్రహంతో రైతులు జరిపిన దాడిలో డ్రైవర్సహా బిజెపికి చెందిన మరో ముగ్గురు మృతి చెందారు.