సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషించగా విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో నటించారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘తలైవి’ సినిమాను ఈనెల 10న విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. సినిమా విడుదల సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
చాలా కష్టంగా అనిపించింది…
‘తలైవి’ కోసం బరువు తగ్గడం, పెరగడం అనేది చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా అనేది జయలలిత పదహారేళ్ల నుంచి మొదలై నలభై ఏళ్ల వరకు ఉంటుంది. అందుకే నేను కూడా పాత్రకు తగ్గట్టు ఇరవై కేజీల వరకు పెరిగాను. ‘తలైవి’లో జయలలిత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగారు..?, ఎలా ఎదిగారు..?, ఎంత ఘనంగా బతికారు? అని చూపించాం.
నాలో ధైర్యాన్ని నింపారు…
నేను ఈ సినిమాలోకి రచయిత విజయేంద్ర ప్రసాద్ వల్లే వచ్చాను. ఇక అమ్మ జయలలిత పాత్రను పోషించడం అంత సులభం కాదు. అయితే దర్శకుడే నాలో ధైర్యాన్ని నింపారు, నన్ను నమ్మారు.
జయమ్మకు అభిమానిగా మారా…
ఈ కథ విన్నప్పటి నుంచి నేను జయమ్మకు అభిమానిగా మారాను. సినిమా కోసం ఆమెలా మారిపోయేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె నాకు ముఖ్యమంత్రిగానే కాకుండా పెద్ద నటి అని కూడా తెలుసు. అంతకంటే ఎక్కువగా తెలియదు.
ఇష్టం లేకపోయినా వచ్చారు…
సినీ కెరీర్ ప్రారంభంలో జయలలితని జూనియర్ ఆర్టిస్ట్ కూతురు అని అన్నారు. ఆమెకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా వచ్చారు. టాప్ ప్లేస్కు చేరుకున్నారు. స్టార్ హీరోయిన్గా రాణించి ప్రేక్షకులను అలరించారు.
ఆ ఉద్దేశ్యం లేదు…
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా వెక్కిరించారు. పహాడి అమ్మాయి.. ఆమె ఏం చేయగలదు అని అన్నారు. కానీ నేను కూడా ఎన్నో విజయాలు సాధించాయి. కానీ నా ప్రయాణం ఇక్కడే ఆగింది. జయమ్మ రాజకీయాల్లోనూ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం అయితే నాకు ఇప్పుడు లేదు. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి.. ఎంతో మందికి దగ్గరవ్వాలి.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ చేస్తున్నాను. ఇంకా ఎంతో మంది వీరనారుల చరిత్రలున్నాయి. ప్రస్తుతం ఇందిరా గాంధీ పాత్రను పోషించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా.