డిఎంహెచ్ఓలకు, నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్కు లేఖ రాసిన డైరెక్టర్
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణా ప్రాంతాల్లో ఉండే పిహెచ్సిల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రోవైడర్స్(ఎంఎల్హెచ్పీ)గా పనిచేసేందుకు కావాలంటూ వైద్యశాఖ ప్రకటించింది. ఆసక్తి గల వారి వివరాలను వెంటనే అందించాలని అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో పాటు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్కు ఎన్హెచ్ఎమ్(నేషనల్ హెల్త్ మిషన్) డైరెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, రెగ్యూలర్ ఉద్యోగులు ఎంఎల్హెచ్పి అర్హులని ఆమె తెలిపారు. దీంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్లో ఉన్న వారిని కూడా తీసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కానీ కచ్చితంగా బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు.
ఎంపికైన తర్వాత ఉండే నిబంధనలు…
ఎంఎల్హెచ్పి ఎంపికైన స్టాఫ్ నర్సుకు ఆరు నెలల పాటు బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత గ్రామీణా ప్రాంతాల్లో ఒక సబ్ సెంటర్ను కేటాయించి మూడు సంవత్సరాల బాండ్తో దానిలో పనిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం నుంచి ఎంఎల్పిహెచ్పికి ఎంపికైన వారికి రూ.25వేల జీతంతో పాటు రూ.15వేలు నగదు ప్రోత్సాహం కూడా ఇస్తారు. రెగ్యూలర్ ఉద్యోగులకు మాత్రం వారి జీతంతో పాటు రూ.15వేలు ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 1 వరకు, మద్యాహ్నం 3 నుంచి 6 వరకు ఓపి క్లినిక్స్ చూసుకోవాల్సి వస్తుందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల వరకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నట్లు ఆమె ప్రకటించారు. వీటిని జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేసే నర్సులకు ఇక నుంచి సిమెంట్ కలర్ రంగుతో కూడిన యూనిఫామ్ను ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం.