శ్రీనగర్: పూర్వ జమ్మూ కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ కేంద్ర పాలితప్రాంతంలోని వివిధ పార్టీలు కూటమిగా ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్లో జమ్మూ కశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(జెకెపిసిసి) శుక్రవారం చేరింది. ఇక్కడి గుప్కర్ ప్రాంతంలోని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి నివాసంలో జరిగిన కూటమి సమావేశంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సారథ్యంలోని ఈ కూటమికి మెహబూబా ముఫ్తి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
కూటమితోనే తాము కొనసాగనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ మోంగా విలేకరులకు తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, చక్కని ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. కూటమిలో భాగస్వామిగా ఉంటామని, డిడిసి ఎన్నికల్లో సీట్ల పొత్తు కుదుర్చుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు కశ్మీరుకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రొవిన్షియల్ అధ్యక్షుడు నసీర్ అస్లాం వనీ తెలిపారు.