హైదరాబాద్: పేద ప్రజల శుభకార్యాలకు, ఫంక్షన్లకు తగిన బడ్జెట్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణాలు చేపట్టిందని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం మారేడుపల్లిలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంత్రి కెటిఆర్, పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఫంక్షన హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… సనత్ నగర్ నియోజకవర్గం మోండా డివిజన్ గ్యాస్ మండిలో రూ.2.40 కోట్లతో అత్యధునిక స్పోర్ట్ కాంప్లెక్స్, ఆదయ్య నగర్లో రూ.3 కోట్లతో లైబ్రరీ భవనం, మారేడుపల్లిలో రూ.3 కోట్లతో అధునాతన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను ప్రారంభించామని తెలిపారు. యువతకు వ్యాయమశాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ అగకూడదని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని దానికి అనుగుణంగానే ఈ రోజు ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేలా లక్షలు ఖర్చుచేసి ఫంక్షన్ హాళ్ళను జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిటీహాల్, ఫంక్షన్ హాళ్ళను ప్రభుత్వ బాధ్యత తీసుకొని నిర్మించిందని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఇబ్బందులను గమనించి ప్రజలను ఆదుకునేందుకు నగదు పంపిణీని రాజకీయం చేశారని ఆరోపించారు. ఈ కమ్యూనిటీ హాళ్ళు, మల్టీఫంక్షన్ హాళ్ళ నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, జిహెచ్ఎంసి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డిలు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్, సుబ్రమణ్య స్వామి టెంపుల్ చైర్మన్ సి. సంతోష్ యాదవ్, మోండా ఉపాధ్యక్షుడు సానది శ్రీనివాస్, శ్రీపాండు రంగ విఠలేశ్వర స్వామి టెంపుల్ సభ్యుడు పెంట శ్రీహరి, పెద్ద నర్సింహ్మా, భవానీ, తదితరులు పాల్గొన్నారు.