లండన్ : బ్రిటన్లో జాన్సెన్ కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. 130 ఏళ్లుగా పలు ఔషధ ఉత్పత్తులలో ఉన్న ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ ఔషధ సంస్థ జాన్సెన్ ఈ వ్యాక్సిన్ను రూపొందిస్తోంది. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ ప్రపంచస్థాయిలో తుది దశకు చేరుకున్న తొట్టతొలి కోవిడ్ వ్యాక్సిన్ ఘనత జాన్సెన్కే దక్కుతుంది. ఫైనల్ స్టేజీ పరీక్షలకు రంగం సిద్ధం అయిందని పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ సౌల్ ఫౌస్టు తెలిపారు. ఇప్పుడు తమ వ్యాక్సిన్ తుది దశ పరీక్షలలో భాగంగా బ్రిటన్ అంతటా కలిసి మొత్తం 6000 మందిని శాస్త్రజ్ఞులు ఎంపిక చేసి, వారిపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇవి సోమవారం నుంచి ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న వ్యాక్సిన్లో సురక్షితమైన కోల్డ్ వైరస్ను వినియోగించుకుంటారు. దీని ద్వారా మనిషి శరీరంలోనికి కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ను పంపిస్తారు. ఈ ప్రోటీన్ మనిషిలో తగు రోధనిరోధక శక్తి కల్గించి కరోనా వైరస్నుఅరికట్టుతుందని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు.
స్పైక్ ప్రోటీన్తో కరోనా నివారణ సాధ్యం అవుతుందనేది ఓ అత్యుద్భుత వార్తనే అవుతుందని సౌథాంప్టన్ యూనివర్శిటీలో పెడియాట్రిక్ ఇమ్యూనాలజీ, అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ అయిన ఫౌస్టు తెలిపారు. ప్రస్తుతానికి తమ వ్యాక్సిన్ పరిశోధనలు బ్రిటన్కు పరిమితం అవుతాయని, తరువాత ఆరుదేశాలకు చెందిన మొత్తం 30వేల మందిని వ్యాక్సిన్ పరీక్షల కోసం రిక్రూట్ చేసుకుంటామని వివరించారు. ఈ వ్యాక్సిన్ పనితీరు ప్రాధమిక ఫలితాలతో చూస్తే చాలా ప్రోత్సాహకరంగా ఉందని , దీనిని అన్ని స్థాయిలో సమగ్రరీతిలో పరీక్షించడం జరుగుతుందని తెలిపారు.