జైపూర్: ఒక 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిపిన కేసులో గతంలో సస్పెన్షన్కు గురైన న్యాయమూర్తిని రాజస్థాన్లోని భరత్పూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సస్పెన్షన్లో ఉన్న న్యాయమూర్తిని బుధవారం ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు భరత్పూర్ ఎస్పి దేవేంద్ర కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రశ్నించడం, అరెస్టు జరిగాయని ఎస్పి చెప్పారు. అవినీతి కేసులను విచారించే కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తిగా నియమితులైన జితేంద్ర సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో రాజస్థాన్ హైకోర్టు అక్టోబర్ 31న ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. తన 14 ఏళ్ల కుమారుడికి గత నెలరోజులుగా ఏదో మత్తు పదార్థం ఇచ్చి జితేంద్ర సింగ్, మరో ఇద్దరు లైంగిక దాడి జరిపారని ఆ బాలుడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక న్యాయమూర్తిపై ఐపిసిలోని వివిధ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.