Monday, April 29, 2024

చిన్న సాయమైనా మిన్నదే

- Advertisement -
- Advertisement -

KTR Distribution Of Vehicles To Physically Handicapped

దివ్యాంగులపై మానవతా దృక్పథం
చూపాలి అర్భాటాలకు వృథా ఖర్చు
చేయొద్దని నా పుట్టినరోజు సందర్భంగా
పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చాను
స్పందించిన మంత్రులు, టిఆర్‌ఎస్
ఎంపిలు, ఎంఎల్‌ఎలు తదితరులు
దివ్యాంగులను ఆదుకోవడానికి
ముందుకొచ్చారు వారందరికీ
పేరుపేరునా కృతజ్ఞతలు ‘గిఫ్ట్ ఎ
స్మైల్’ త్రిచక్ర వాహనాల పంపిణీని
ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. వారికి అండగా ఉండి చేయూతనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అనవసర ఖర్చులు మానుకుని వారికి సాయం చేద్దామన్నారు. మనం చేసే చిన్న సాయం కొన్ని సందర్భాల్లో దివ్యాంగులకు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో తమ శక్తి మేరకు ముందుకు వచ్చి దివ్యాంగులను ఆదుకోవాలన్నారు. రాజకీయాల్లో నాయకుల పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీల పేరిట పెద్దఎత్తున డబ్బులను వృధాగా ఖర్చుచేయడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఎవరూ ఫ్లెక్సీలు, బ్యానర్లకు డబ్బు వెచ్చించవద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు.  తన పిలుపుకు స్పందించి పలువురు మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు గిఫ్ట్..ఎ..స్మైల్ కింద పెద్దఎత్తున దివ్యాంగులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు.

ఇందుకు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు. గిఫ్ట్..ఎ..స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల తొలివిడత పంపిణీలో ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో మంత్రి కెటిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతు, దివ్యాంగులను ఆదుకోవాలన్న లక్షంతోనే గత ఏడాది నుంచి ‘గిఫ్ట్..ఎ..స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అందులో భాగంగా గతేడాది సిరిసిల్లలో ఆరు ఆంబులెన్స్‌లు పంపిణీ చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా 100 అంబులెన్స్‌లు పంపిణీ చేశామన్నారు. కాగా ఈ ఏడాది దివ్యాంగుల కోసం 130 స్కూటర్లను అందిస్తున్నామన్నారు. ఈ వాహనాలు కేవలం వారి రవాణా కోసమే కాకుండా ఒక జీవన ఉపాధి కల్పించి తమ కాళ్ళపై నిలబడే విధంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వాహనాలు అందుకున్న వికలాంగులతో మాట్లాడిన మంత్రి కెటిఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో వారితో కలిసి ఆయన భోజనం చేశారు.

వృథాగా ఖర్చు చేయవద్దు

రాజకీయాల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులను సైతం పెద్దమొత్తంలో పెట్టాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా నాయకులు పుట్టిన రోజు వేడుకల కోసం బ్యానర్లు, హోర్డింగుల కోసం చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉంటామన్నారు. అవన్నీ తగ్గించుకుని ఆ డబ్బులను అవసరాలకు ఉపయోగించాలన్నదే తన ముఖ్యఉద్దేశమన్నారు. ఈ నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగించడం వల్ల కొన్ని వర్గాలకు అయినా మేలు జరిగేందుకు అవకాశముంటుందన్నారు. ఈ నేపథ్యంలో గిఫ్ట్..ఎ..స్మైల్‌కు పిలుపునిచ్చానని మంత్రి అన్నారు.

దీనిని పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా తీసుకున్నాన్నారు. వారుసైతం ముందుకు వచ్చి అంబులెన్స్‌లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు వంటివి పంపిణి చేశారన్నారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ముందుకెళతామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కాగా తన పిలుపుకు స్పందించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 150, కూకట్‌పల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు కృష్ణారావు 100, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు వివేకానంద్ 50, ఎంఎల్‌సి నవీన్‌రావు 100, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు 63 చొప్పున స్కూటర్లు అందించేందుకు ముందుకు వచ్చినట్టు ఆయన ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News