Monday, April 29, 2024

మోడీ పర్యటనపై కెటిఆర్ ప్రశ్నల వర్షం..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలతో నిలదీశారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన అనంతరం మూడు రోజుల వ్యవధిలో మరోసారి తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై మంత్రి కెటిఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.”మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…???. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు?. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు?. మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది?. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర?. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు?. గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా?. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారు.

మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు. మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప, దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా?. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో?. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి?. మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ” అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News