మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పట్లో కరోనా వైరస్ మనల్ని వదిలి పెట్టే అవకాశం కనిపించడం లేదని, దానికి పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు సహజీవనం చేయాల్సిందేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. త్వరలో దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేసే అవకాశమున్న నేపథ్యంలో.. ఆ తరువాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖతో కలిసి మున్సిపల్ శాఖ విడుదల చేస్తుందన్నారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరిబేసి విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుతం పాటిస్తున్న మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, సానిటైజర్ల వినియోగం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
KTR Review Meeting With Municipal Commissioner