Monday, April 29, 2024

హసన్ సీటుపై దేవెగౌడ కుటుంబంలో చీలికలు..?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య , ఎమ్‌ఎల్‌ఎ అనితా కుమారస్వామి పోటీ చేసే ప్రసక్తే లేదని జెడి(ఎస్) నేత కుమారస్వామి మంగళవారం స్పష్టం చేశారు. అనితా కుమారస్వామి తన వదినకి హసన్ నియోజక వర్గం నుంచి పోటీకి టిక్కెట్ లభిస్తే తనకు తుంకూర్ గ్రామీణ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారన్న మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు. పాత్రికేయులతో మంగళవారం మాట్లాడుతూ “హసన్ నియోజకవర్గ రాజకీయాలు వేరు, నా భార్య రాజకీయాలు వేరు. గతంలో ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థి లేకపోవడంతో అనిత మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారని, పార్టీని కాపాడటం కోసం తాను ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పోటీ చేయించానని కుమారస్వామి పాత్రికేయులకు వివరించారు.

అయితే హసన్ నియోజకవర్గానికి సంబంధించి దేవ్‌గౌడ కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ కుమారస్వామిని కలవర పరిచేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కుమారస్వామి పెద్ద సోదరుడు, మాజీ మంత్రి హెచ్‌డి రేవన్న భార్య భవానీ రేవన్న మాజీ హసన్ జిల్లా పంచాయతీ సభ్యురాలు, మాజీ ప్రధాని దేవెగౌడకు పెద్ద కోడలు. ఆమె తన భర్తకు, కుమారులు ప్రజ్వల్, సూరజ్ రేవన్నలకు మద్దతుగా రాజకీయాలు నడుపుతున్నారు. ప్రజ్వల్ హసన్ నియోజకవర్గ లోక్‌సభ సభ్యులు కాగా, సూరజ్ ఎంఎల్‌సి గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా పోరాడడానికి గౌడ కుటుంబం లోని కోడళ్ల మధ్య ఎలాంటి పోటీ లేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హసన్ నియోజకవర్గ టికెట్ విషయంలో దేవెగౌడ కుటుంబంలో చీలికలు వచ్చే సంకేతాలు వెలువడినందున మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం తన ఇద్దరి కుమారులు, పెద్దకోడలు భవానీ రేవన్నలతోసహా దీనిపై చర్చించారు. అయితే దీనిపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించ లేకపోయారు. అయితే అన్నదమ్ములు దేవన్న, కుమారస్వామి లిద్దరూ హసన్ నియోజకవర్గ పోటీపై తుది నిర్ణయం దేవెగౌడకే విడిచిపెట్టారు.

అనితాకుమారస్వామి ప్రస్తుతం రామనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్‌ఎల్‌ఎగా ఉన్నారు. ఆమె కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఆ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన తల్లి ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న కథనాలను నిఖిల్ తోసిపుచ్చారు. “ఆమె పోటీ చేసే ప్రసక్తే లేదు. ఎన్నికల రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఏర్పడితే తాను కూడా పోటీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాను”అని నిఖిల్ స్పష్టం చేశారు. నిఖిల్ తన నటనారంగం నుంచి రాజకీయ నాయకునిగా మారారు. జెడి(ఎస్) యువజన విభాగం అధినేత అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News