Monday, April 29, 2024

రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు

- Advertisement -
- Advertisement -

Loan waiver

 

గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు
అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ..
కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ
2014 ఏప్రిల్ 1నుంచి డిసెంబర్ 11, 2018 వరకు తీసుకున్న,
రెన్యువల్ చేసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపు
రుణమాఫీకి ప్రత్యేక ఐటి వ్యవస్థ.. స్క్రూటినీకి సంయుక్త మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ
గ్రామ సభలు.. సామాజిక ఆడిట్ తరువాతే జిల్లా లీడ్ బ్యాంకులకు, కలెక్టర్లకు తుది జాబితా
రూ.25 వేల వరకు ఒకే దఫాలో.. మిగిలిన రైతులకు మిగతా మొత్తం నాలుగు దఫాల్లో
అర్హులైన రైతుల వివరాలను బ్రాంచ్‌ల వారీగా తీయనున్న బ్యాంకు మేనేజర్లు
మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పర్యవేక్షణ, గ్రీవియెన్స్ సెల్స్
మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: లక్ష రూపాయాలకు మించకుండా స్వల్పకాలిక పంట రుణాలకు మాఫీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న పంట రుణాలకు కూడా రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి మంగళవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం 2014 ఏఫ్రిల్ ఒకటో తేదీ నుంచి 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా అర్హులైన వారందరికీ పంట రుణ మాఫీ వర్తింపజేస్తారు. రైతులు పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని కొనుగోలు చేసే విధానానికి స్వస్తి చెప్పేందుకు సిఎం కెసిఆర్ ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా సంస్థాగత రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

ప్రైవేట్ వడ్డీవ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి వర్తించదు. రైతు కుటుంబం అంటే భర్త, భార్య వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ లక్ష రూపాయాలలో ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ ఛార్జీలు, ఇన్సురెన్స్ వంటివి ఉండవు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలు తీసుకున్న రైతులకు ఒకే దఫాలో మాఫీ చేస్తారు. మిగతా రైతులకు మిగిలిన మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతులకు అకౌంట్ పే చెక్కుల ద్వారా మాఫీ చేయనున్నారు. మాఫీ పొందిన రైతుల సంతకాలను కూడా సేకరించనున్నారు. చెక్కులు ఇచ్చే సమయంలో వ్యవసాయ శాఖ రైతుల దగ్గర నుంచి మోసపోరితంగా మాఫీ పొందడం లేదని, ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా అండర్ టెకింగ్ తీసుకుంటుంది. రుణమాఫీపై పర్యవేక్షణకు, పిర్యాదుల పర్యవేక్షణకు గ్రీవియెన్స్ సెల్స్ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేస్తారు.

రుణమాఫీ అర్హుల గుర్తింపు ఇలా

* మొదటి సారి మాఫీ చేసినప్పుడు తీసుకున్న కటాఫ్ తేదీ తరువాత ఏఫ్రిల్ 01, 2014 నుంచి డిసెంబర్ 11, 2018 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా మాఫీ చేస్తారు.
* బంగారం తాకట్టుతో గ్రామీణ ప్రాంతాల్లో (అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంక్స్ మినహా) తీసుకున్న పంట రుణాలు రూ. ఒక లక్ష వరకు మాఫీ చేస్తారు.
* రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నప్పటికీ ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయల మేరకు రుణం మాఫీ చేయాలని నిర్ణయించారు. రైతు కుటుంబం అంటే కుటుంబ పెద్ద, భార్య వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు.

* ఒకవేళ కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పంటరుణానికి అర్హులైతే రూ. ఒక లక్ష మొత్తంలో ఉన్నవారందరికీ సమానంగా ఇస్తారు.
* స్వల్పకాలిక పంట రుణాలు 18 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది, ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
* రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఎఇఒ, విఆర్‌ఒ, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. వీరికి మండల తహసీల్దార్, ఎంపిడిఒ, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షకులుగా ఉంటారు.
వీటికి వర్తించదు
టై అప్ రుణాలు
ఖాతా తీసేసిన పంట రుణాలు, రాతపూర్వక రుణాలు
జెఎల్‌జి, ఆర్‌ఎంజి, ఎల్‌ఇసి రుణాలు
రీస్ట్రక్చర్డ్, రీషెడ్యూల్ రుణాలు

అమలు మార్గదర్శకాలు ఇలా
* రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు ఒక ఐటి వ్యవస్థ లేదా పోర్టల్‌ను ఖచ్చితంగా వ్యవసాయ శాఖ తయారు చేయాలి. రైతుల సమాచారం కోసం, వారి రుణాల మొత్తం వంటి ఫైనల్ చేసేందుకు దీనిని వినియోగించాలి.
* ప్రతీ బ్యాంకు బ్రాంచ్‌ల వారీగా కటాఫ్ తేదీకి అనుగుణంగా ఇచ్చిన పంట రుణాలను నిర్దేశించిన నమూనాలో గ్రామాల వారీగా రైతుల జాబితాను రూపొందించాలి.
* అలాగే ప్రతీ బ్యాంకు బ్రాంచ్‌ల వారీగా బంగారు తాకట్టుపై గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న రుణాలను రైతుల జాబితాను నిర్దేశించిన నమూనాలో రూపొందించాలి.

* అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకుల శాఖాల్లో పంట రుణాలుగా బంగారంపై పొందిన అప్పుకు మాఫీ వర్తించదు. అయితే కొన్నిచోట్ల గ్రామీణ ప్రాంతాలకు సేవా ప్రాంతాలుగా ఉన్న అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకుల్లో పొందిన రుణాలకు మాఫీ వర్తిస్తుంది.
* రెండు నమూనాల్లో (అనక్షర్ ఎ, అనక్షర్ బి) పొందుపర్చిన రైతుల జాబితా సమాచారాన్ని బ్యాంకు మేనేజర్ సరిపోల్చుకోవాలి. తరువాత రూ. లక్ష మించకుండా ఉన్న పంట రుణాల తుది జాబితాను అనక్షర్ సి నమూనాలో రూపొందించాలి. ఈ మూడు అనక్షర్ ఎ,బి,సిలు బ్యాంక్ మేనేజర్ లీడ్ బ్యాంకు మేనేజర్‌కు, జిల్లా కలెక్టర్‌కు పంపించాలి.
* రైతుల అన్ని వివరాలు ఆధార్, కులం , ఫోన్ నెంబర్, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, బ్యాంకు పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, ఎప్పుడు, ఏ పంటకు లోన్ తీసుకున్నారనే వివరాలు సేకరిస్తారు. అసలు ఎంత, వడ్డీ ఎంతైంది అనే వివరాలు కూడా నమోదు చేస్తారు.

* కొందరు రైతులు ఒకే బ్యాంకు వేరు బ్రాంచ్‌లలో లేదా వేరే బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్నారు. డూబ్లికేషన్, డబుల్ పేమేంట్ వంటివి ఆరికట్టేందుకు ఒక రైతు కుటుంబానికి రూ. ఒక లక్ష మాఫీ ప్రయోజనం పరిమితం చేసేందుకు మండల స్థాయిలో సంయుక్త మండల బ్యాంకర్ల కమిటీ (జెఎంఎల్‌బిసి) ఏర్పాటు అవుతుంది.

* జెఎంఎల్‌బిసి సమావేశంలో అన్ని బ్యాంకులు ప్రభుత్వం సూచించిన విధంగా రూపొందించిన రైతుల జాబితాలను ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌లో ఎంత మొత్తం రుణం తీసుకున్నారనే వాటిని సరిపోల్చుతారు. వీటన్నింటి జాయింట్ మండల కమిటీ సమీక్షిస్తుంది. ఇక్కడ రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సరిపోల్చుతారు. మండల తహసీల్దార్ కూడా అనక్షర్ సిలో ఉన్న రైతుల జాబితాను సరిచూస్తారు. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో ఎవరైనా రుణం తీసుకున్నారా, వ్యవసాయ భూములున్న వారేనా వంటిని చూస్తారు. ఈ సందర్భంగా అర్హత లేని వారుంటే తొలగిస్తారు. ఇక తరువాత జెఎంఎల్‌బి కమిటీ రైతు కుటుంబం ఏ బ్యాంకులో ఎంత రుణం తీసుకుందో గుర్తిస్తుంది. అందుకు అనుగుణంగా రూపొందించిన అనక్షర్ డిలో సమాచారం పొందుపరుస్తారు.

* జిల్లా సహకార శాఖ అడిటర్స్ ప్యాక్స్, డిసిసిబిలకు సంబంధించిన డి జాబితాతో పాటు ఎ,బి,సి జాబితాలను కూడా ధ్రువీకరించాలి. జిల్లా కోఆపరేటివ్ అడిట్ అధికారి జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి, తన పరిధిలోని మండలాలకు ఆడిటర్స్‌ను నియమించాలి. డిప్యూటి కలెక్టర్ హోదా ఉన్న అధికారి ఆడిట్ రిపోర్ట్ సమావేశాలకు పరిశీలకుడిగా ఉంటారు.
* బ్యాంకులు, జెఎంఎల్‌బిసి ఫైనల్ చేసి అనక్షర్ సి, డిలను ఐటి పోర్టల్‌లో స్రూటిని చేస్తారు.

* తాత్కిలిక తుది జాబితా (అనక్షర్ ఇ)ను సంబంధిత గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సామాజిక అడిట్ నిర్వహిస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. ఆ తరువాత బ్రాంచ్‌ల వారీగా అర్హలైన రైతుల తుది జాబితాను లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్‌డిఎం), జిల్లా కలెక్టర్‌కు పంపుతారు.
* రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను జిల్లాల్లో బ్యాంకర్ల మీటింగ్‌లో సమీక్షించి, రికార్డు చేసి దానిని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. అదే ఐటి పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

Loan waiver as a Farmers family unit
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News