Monday, April 29, 2024

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

- Advertisement -
- Advertisement -

modi

 

ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి మించి లాక్‌డౌన్ అమలు చేస్తాం. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. ఇళ్లల్లోనూ దూరం దూరంగా ఉండాలి.

                                                                                          – ప్రధాని మోడీ

21రోజులు లాక్‌డౌన్

అర్ధరాత్రి నుంచే అమలు

దేశమంతా ఏప్రిల్ 14 దాకా ఇల్లు దాటొద్దు
ప్రధానిగా చెప్పడం లేదు.. కుటుంబసభ్యుడిగా కోరుతున్నా
జనతా కర్ఫూ కన్నా సీరియస్, దేశానికిది పరీక్షా సమయం
నిర్లక్షంగా ఉంటే భారీ మూల్యం తప్పదు, ఇళ్లే లక్ష్మణ రేఖ
సామాజిక దూరం పాటించడమే కరోనా కట్టడికి పరిష్కారం
వైద్య సదుపాయాలు, సహాయం కోసం 15వేల కోట్లు
ప్రజాఆరోగ్య పరిరక్షణకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన : జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

న్యూఢిల్లీ: మంగళవారం అర్ధరాత్రి 12 గంటలనుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వస్తుందని ప్రధానినరేంద్ర మోడీ ప్రకటించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి లాక్‌డౌన్ తప్పదని మోడీ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ మూడు వారాలు ఉంటుందని ప్రకటించారు. ఇది ఒక రకంగా కర్ఫూ వంటిదేనని అన్నారు. రాబోయే 21 రోజులు ప్రతి ఒక్కరికీ కీలకమని వ్యాఖ్యానించారు. దేశానికి ఇది పరీక్షా సమయమని, నిర్లక్షంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లో రెండో సారి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సంక్లిష్ట సమయంలో దేశప్రజలందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించడం ఒక్కటే ఈ మహమ్మారిని అరికట్టేందుకు మార్గమని స్పష్టం చేశారు.

దీనికి స్వీయ నిర్బంధం తప్ప మరో మార్గం లేదన్నారు. సమిష్టిగా ఈ వైరస్‌పై పోరాడాలని పిలుపునిచ్చా రు. ఇళ్లలో ఉంటేనే ఈ వైరస్‌నుంచి బైటపడగలమని అన్నారు. మహమ్మారి వైరస్ సైకిల్‌ను మనం అడ్డుకొని తీరాలన్నారు. ‘ కరోనా వైరస్ గురించి మాట్లాడడం కోసం నేను మరోసారి మీ ముందుకు వచ్చాను. ఈ నెల 22న మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. జాతి యావత్తు దాన్ని దాన్ని ఎంతో బాధ్యతాయుతంగా నెరవేర్చింది. ఈ క్లిష్ట సమయంలో పిల్లలు, పెద్ద, చిన్నా, పేద, ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జనతా కర్ఫూను విజయవంతం చేయడానికి ముందుకు వచ్చారు. దేశానికి, మానవాళికి సమస్య వచ్చినప్పుడు తామంతా కలిసికట్టుగా దానిపై పోరాడుతామని భారతీయులు మరోసారి చాటి చెప్పింది’ అని ప్రధాని అన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచాన్నంతా వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మరింత కఠినమైన నిర్ణయాలను తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ‘ఈ మహమ్మారి గురించి మీరు వింటూనే ఉన్నారు.

ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో అత్యంత శక్తివంతమైన దేశాలు కూడా విఫలమవుతున్న విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. కరోనా సంక్రమించిందన్న విషయాన్ని ముందు ఎవరూ గుర్తించలేరు. వారు బయట తిరగడం వల్ల వందలాది మందికి ఈ వైరస్ సోకుతుంది. అందువల్ల వ్యాధిలక్షణాలున్న వారే కాకుం డా అందరూ సామాజిక దూరం పాటించాలి’ అని అన్నా రు. తాను ప్రధానిగా కాకుండా మీ కుటటుంబ సభ్యుడిగా ఈ విషయం చెప్తున్నానని, రాబోయే 21 రోజులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అలా కాకపోతే ఒక వ్యక్తినుంచి వేలాది మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.11 రోజుల్లోనే లక్షనుంచి రెండు లక్షల మందికి ఈ వైరస్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస ్థ(డబ్లు హెచ్‌ఓ) గణాంకాలు చెప్తున్నాయని గుర్తు చేశారు. ఈ లాక్‌డౌన్ ప్రతి ఇంటికీ ఓ లక్ష్మణ రేఖ అని అన్నారు. .

కరోనా చికిత్సల కోసం రూ. 15 వేల కోట్లు
తొలి ప్రాధాన్యత ఆరోగ్య సేవలకే ఇవ్యాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా. ప్రజలు ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మవద్దు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను, వైద్యుల సూచనలను మాత్రమే పాటించాలి. వైద్య లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దు.21 రోజులు పెద్ద సమయమే. అయితే మీ ప్రాణాలను కాపాడుకోవడానికి, మీ కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఇదే సరయిన మార్గం. కరోనాపై మన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాలి. ప్రజల ప్రాణాలను కాపాడడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. వైద్య చికిత్సల మెరుగు కోసం కోసం కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించిందని ప్రధాని చెప్పారు.

ఈ లాక్‌డౌన్ కారణంగా మనకు ఆర్థికంగా భారం పడవచ్చు కానీ ప్రజల రక్షణకు ఇది చాలా ముఖ్యమని చెప్పారు. కరోనాఅంటే ‘ కోయీ రోడ్‌పర్ న నికలే’ (ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదు) అని అర్థమని ప్రధాని కొత్త నిర్వచనం చెప్పారు. చైనా, ఇరాన్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలు కూడా కరోనాను కట్టడి చేయలేక సతమతమవుతున్నాయి. ఇటలీ, అమెరికా దేశాల్లో ప్రపంచంలోనే ఉత్తమమైన వైద్య చికిత్సా విధానాలున్నాయి. అయినప్పటికీ ఆ దేశాలు దీన్ని అదుపు చేయలేకపోతున్నాయి. అయితే ఈ వైరస్‌ను కొంతమేరకు ఆదుపు చేసిన దేశాలతో మనకు కొంత ఆశ వస్తోంది. ఆ దేశాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండి తమ ప్రభుత్వాలు విధించిన నిబంధనలను పాటించాయి. ఈ లాక్‌డౌన్ మీ ఇంటి గుమ్మం ముందు గీచిన ‘లక్ష్మణ రేఖ’. మీరు ఒక్క అడుగు బైట పెట్టినా కరోనా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని మోడీ చెప్పారు.

వారి గురించి ఆలోచించండి
‘ మీ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి 24 గంటలూ పని చేస్తున్న మీడియా గురించి ఆలోచించండి. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కాపాడడం కోసం విధులు నిర్వర్తిన్న పోలీసు అధికారుల గురించి ఆలోచించండి. నర్సులు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పాథాలజిస్టులు ఇలా మీ స్రాణాలు కాపాడడానికి తమ జీవితాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు పని చేస్తున్న వారి గురించి ఆలోచించండి. వైరస్‌ను పేర్తిగా అంతం చేయడం కోసం మీ చుట్టుపక్కల ప్రాంతాలను శానిటౌజ్ చేసే వారి కోసం ప్రార్థించండి’ అని ఆయన అన్నారు.

 

Lockdown for 21 days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News