మనతెలంగాణ/హైదరాబాద్ : వృత్తిలో ప్రతిభ కనబరిచిన ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య అవార్డులను శుక్రవారం నాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161 జయంతి సందర్భంగా అవార్డులను హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్లో మెగా సిటీ కళావేదిక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ ఇంజనీర్ గా ఉత్తమమైన సేవలందించి ప్రసిద్ధి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరిట అవార్డులను అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ,ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు ప్రముఖ పాత్ర వహించారని తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆశయాలకు అనుగుణంగా ఇంజనీర్లు పని చేయడం వల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ మరియు ఇతర రంగాలలో ఇంజనీర్లు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉందన్నారు. వీరిని ప్రోత్సహించేందుకు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అవార్డులను అందజేయడం సమంజసమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జె.రాజేష్ నేత, ప్రొఫెసర్ డికె రెడ్డి, మల్లికార్జున్ రావు తదితరులుపాల్గొన్నారు.
బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపం
సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సంతాపం వ్యక్తం చేశారు. గాయకుడుగా,సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అవార్డులతో పాటు ఎన్నో నంది అవార్డులను పొందిన బాలసుబ్రమణ్యం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను కలిగి ఉన్నారని వారందరికీ ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యంతో ఉండాలని కోరారు.