Sunday, April 28, 2024

ఈ-శ్రమ్‌లో చేరింది… 42,35,906 మందే

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది చివరి నాటికి కార్మిక శాఖ టార్గెట్ కోటి మంది
అంత మందిని చేర్పించుకునేందుకు ఇంకెన్నాళ్లో..

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ-శ్రమ్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ పోర్టల్‌లో కార్మికుల నమోదు ప్రక్రియ మూడు అడుగుల ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఎప్పుడో జనవరి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌లో కార్మికులను చేర్పించే లక్షాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించగా అది కాస్త నిదానంగానే సాగుతోంది. ఈ ఏడాది నాటికి కోటి మందిని చేర్పిస్తామని చెప్పిన అధికారగణం ఇప్పటి వరకు కనీసం అరకోటి మందిని కూడా చేర్పించలేక పోతోంది. ఈ-శ్రమ్ తాజా గణాంకాల ప్రకారం .. ఈ-శ్రమ్‌లో తెలంగాణ రాష్ట్రంలో చేరిన మొత్తం కార్మికుల సంఖ్య అక్షరాల.. 42,35,906 మాత్రమే.

ఈ సంఖ్య కోటికి చేర్చడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేమని వారు పేర్కొంటుండడం గమనార్హం. ఈ ఏడాది చివరి నాటికి అయినా ఆ లక్ష్యాన్ని చేర్పిస్తారో లేదో వేచి చూడకతప్పదు మరి. కాగా ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి వచ్చే ద్వారా కలిగేలబ్దిని వారికి కార్మిక శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఇందులో చేరిన ప్రతి అసంఘటిత రంగ కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు యూనివర్షల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌కు ఇవ్వనున్నారు. కాగా ఈ శ్రమ్ కార్డు ఉంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. ఈ -శ్రమ్ పోర్టల్‌ను 2021 ఆగస్టు నెల 26న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42,35,906 మంది తమ పేర్లను ఈ-శ్రమ్‌లో పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న నేపథ్యంలో ఏదేని పరిస్థితుల్లో కార్మికుడు మరణించినా లేదా అంగవైకల్యం కలిగినా రూ. 2 లక్షల వరకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద అందజేయనున్నారు. ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులనుద్దేశించి చేసే పథకాలు, విధానాలకు ఈ డేటా బేస్‌నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. అలాగే తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారికి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈశ్రమ్‌లో చేరింది..ఏ జిల్లాలో ఎంత మంది?
కాగా ఈ-శ్రమ్‌లో ఇప్పటి వరకు 42 లక్షల 35 వేల 905 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాల వారీగా వారి వివరాల నమోదు పరిశీలిస్తే.. హైదరాబాద్ జిల్లాలో 3,18,543, రంగారెడ్డి జిల్లాలో 3,14,855, నల్గొండ జిల్లాలో 1,97,371, ఖమ్మం జిల్లాలో 1,95,026, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,72,009, కరీంనగర్ జిల్లాలో 1,62,283, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,52,371, కామారెడ్డి జిల్లాలో 1,49,477, సంగారెడ్డి జిల్లాలో 1,48,019, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1,47,853, హనుమకొండ జిల్లాలో 1,40,674, ఆదిలాబాద్ జిల్లాలో 1,28,563 , జగిత్యాల జిల్లాలో 1,23,789, సూర్యాపేట జిల్లాలో 1,23,789, మహబూబాబాద్ జిల్లాలో 1,23,217, వరంగల్ జిల్లాలో 1,21,919, నిజామాబాద్ జిల్లాలో 1,19,805, సిద్దిపేట జిల్లాలో 1,18,710, పెద్దపల్లి జిల్లాలో 1,14,335, మంచిర్యాల జిల్లాలో 1,07,280, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,03,919 , నాగర్ కర్నూలు జిల్లాలో 96,942, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 94,668, నిర్మల్ జిల్లాలో 93,883, యాదాద్రి భువనగిరి జిల్లాలో 93,377, వికారాబాద్ జిల్లాలో 89,948, వనపర్తి జిల్లాలో 86,609, మెదక్ జిల్లాలో 85,856, నారాయణపేట జిల్లాలో 69,361, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 65,147, జనగాం జిల్లాలో 63,538 , కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 58,236, ములుగు జిల్లాలో 50,573 మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News