Monday, April 29, 2024

విద్యా విధానం రాజకీయ పావు కాదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్య ప్రగతి దిశలో ఓ కాంతిపుంజం అవుతుందని , విద్యారంగాన్ని రాజకీయ ఎత్తుగడలకు పావుగా మల్చుకోరాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)ను తాము రద్దు చేస్తున్నట్లు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంపై కేంద్ర మంత్రి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇది గర్హనీయ చర్య అని గురువారం స్పందించారు. విద్యా రంగ సంబంధిత అంశాలను రాజకీయ కోణాలలో చూడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, ప్రగతికి సరైన దిశానిర్ధేశనం చేసే విద్యారంగం పట్ల సంకుచిత ధోరణి అనుచితం అవుతుందని తెలిపారు. ఎన్‌ఇపి 2020ని నిలిపివేస్తున్నట్లు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడి సిఎం రాజకీయ దురుద్ధేశాలకు అనుగుణంగా నిర్ణయించుకుందని విమర్శించారు. మన విద్యా వ్యవస్థ పరిణామాత్మకం కావాలి.

అంతేకానీ తిరోగమనవాదాన్ని సంతరించుకోరాదని , నెప్ 2020 అమాంతంగా తీసుకువచ్చిన ప్రక్రియ కాదని మంత్రి తెలిపారు. ఏండ్ల తరబడి తగు విధంగా సంప్రదింపులు జరిగాయి. నిపుణుల నుంచి సముచితమైన అధ్యయనం సాగింది. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది నిలుస్తుందని, అయితే దీనిని రద్దు చేయాలనే కర్నాటక సిఎం నిర్ణయం , ఆయన దీనిని సమర్థించుకోవడం కేవలం సంస్కరణలకు వ్యతిరేకం. భారతీయ భాషలకు అవమానకరం, కర్నాటక విశిష్టతకు ప్రతిఘాతం అని ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కర్నాటకలో నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేస్తున్నట్లు సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎన్‌ఇపిని కేంద్ర ప్రభుత్వం ఆదరబాదరగా కర్నాటకలో ప్రవేశపెట్టిందని , రాజకీయ ప్రాబల్యం చాటుకునేందుకు ఈ విధంగా చేశారని, ఇప్పటికిప్పుడు దీనిని ఎత్తివేయడం కుదరనందున వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని ఎత్తివేస్తున్నట్లు సిఎం పేర్కొనడం వివాదాస్పదం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News