మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో కలకత్తాలో చిక్కుకుపోయిన విద్యార్ధుల కోసం మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 75 మంది విద్యార్ధుల అభ్యర్థన మేరకు 3 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్కి తీసుకువస్తున్నారు. ఈసందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేస్తుందన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన లాక్డౌన్ వల్ల చాలా మంది తెలంగాణ వాసులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, ఈక్రమంలో వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలెవ్వరు భయబ్రాంతులకు గురికావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు.
Minister Etela arrange 3 buses for 75 students stuck in Kolkata