Monday, April 29, 2024

జాతీయ హోదా తెండి

- Advertisement -
- Advertisement -

 

మా పాలమూరు
పచ్చబడుతూ ఉంటే మీ కళ్లు
ఎర్రబడుతున్నాయి

29 రాష్ట్రాల్లో 4వ అత్యున్నత
ఆర్థిక శక్తిగా తెలంగాణ దీనిని
ఆర్‌బిఐ స్వయంగా
ధ్రువీకరించింది మీరు
తెస్తామన్న నల్లధనమేదీ?
జన్‌ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు
ఎక్కడ? పాలమూరు ప్రాజెక్టుల
కోసం రూ.28వేల కోట్లు ఖర్చు
చేశాం కేంద్రం 28పై.కూడా
ఇవ్వలేదు కృష్ణలో 573
టిఎంసిలు ఇవ్వాలని విన్నవిస్తే
కేంద్రం పట్టించుకోలేదు

75ఏళ్లలో ఎవరూ చేయని రీతిలో
రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో
రూ.50వేల కోట్లను కెసిఆర్ జమ
చేయించారు : నారాయణపేట
జిల్లా పర్యటనలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ నారాయణపేట/మహబూబ్‌నగర్ బ్యూరో : బిజెపి అధిష్టానంపై రాష్ట్ర ఐటి, శాఖ మంత్రి కెటిఆర్ నిప్పులు చెరిగారు. పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బిజెపి నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కరవు, వలసలు పోయి పచ్చబడుతున్న పాలమూరును చూసి కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయని, ప్రాజెక్టులు, చెరువులు నిం డి వ్యవసాయం నింపాదిగా సాగుతుంటే కొంతమందికి గుండెలు మండుతున్నాయని కెటిఆర్ తీ వ్రంగా దుయ్యబట్టారు. బిజెపి నాయకులకు ద మ్ము ధైర్యం, సిగ్గు శరం ఉంటే ముందుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థ్దాపనలు చేసిన మంత్రి కెటిఆర్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇటీవల పాదయాత్రకు వచ్చిన వ్యక్తి ఏదేదో మాట్లాడుతున్నాడు.

కృష్ణా జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పనికి మాలిన మాటలు, పచ్చి అబద్ధ్దాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధికారికంగా, అధికారికంగా చెబుతన్నా.. కృష్ణనది పరివాహక ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 811 టిఎంసిలు మనకు కేటాయింపులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. పంపకాలు వెంటనే తేల్చాలని అనేక సార్లు అడిగాం. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణనది జలాల వాటాలో 575 టిఎంసిలు ఇవ్వండని ఎనిమిదేళ్లు నుంచి అడుగుతన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని అడిగారు. అయినా ఉలుకూపలుకు లేదు. పునర్విభజన చట్టం ప్రకారం బ్రిజెష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయాలని అడిగాం. దున్నపోతు మీద వానపడ్డట్టు ఉందంటూ కెటిఆర్ ధ్వజమెత్తారు. పచ్చబడుతున్న పాలమూరుకు ఏమి చేయలేని బిజెపి నాయకులు పాదయాత్రలు చేస్తే కారుకూతలు, పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, ఎగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు.299 టిఎంసిలకు కెసిఆర్ ఒప్పకున్నారని అబద్ధాలు చెబుత్నునారు.

దమ్ము, పలుకు బడి ఉంటే, మోడీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణపై ప్రేమ, అనురాగం ఉంటే.. రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సవాల్ చేశారు. దివంగత మీ బిజెపి నేత సుష్మాస్వరాజ్ హైదారాబాద్‌లో సభ పెట్టి పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రధాని మోడీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే సుష్మా మాట నిలబెట్టి.. పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పక్కనే కర్నాటకలో తుంగ భద్ర నదిపై ఉన్న అప్పర్ భద్రాకు జాతీయ హోదా ఇస్తారు. కానీ మేం అడిగితే వినబడనట్లుంటారని అమిత్‌షాను కెటిఆర్ అన్నారు. అమిత్‌షాకు నీతి నిజాయితీ, సిగ్గు లజ్జ ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టిఎంసిలు కేటాయించి వెంటనే పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తగా మాటలు చెప్పడు కాదని చేసి చూపాలని కెటిఆర్ ధ్వజమెత్తారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 28 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

పాలమూరు రంగారెడ్డితో పాటు, బీమా, నెట్టెం పాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తిచేసి, చెరువులు నింపడానికి రూ. 28 వేల కోట్లు ఖర్చు చేసి రూ.8 లక్షల ఎకరాలకు అదనంగా అయికట్టులోకి తీసుకొచ్చామని కెటిఆర్ స్పష్టం చేశారు. రూ. 28 కోట్లు ప్రాజెక్టుల కోసం మేం ఖర్చు చేస్తే మోడీ ప్రభుత్వం కనీసం 28 పైసలు కూడా ఇవ్వలేదని సున్నా చూపిందని ఎద్దేవా చేశారు. వికారాబాద్ నారాయణపేట మీదుగా కర్నాటకలోని కృష్ణావరకు రైల్వేలైన్ , గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వే లైన్ అడుగుత్నునారు. ఇంతవరకు వాటిపై స్పందన లేదు. కేవలం ప్రజలను మభ్య పెట్టి పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. అమిత్‌షాకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు జాతీయ హోదాను కల్పించి మాచర్ల, గద్వాల రైల్వేలైన్ ప్రకటించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా 84 నవోదయ పాఠశాలలు మంజూరు చేసి, మన తెలంగాణకు గుండు సున్నా . దేశ వ్యాప్తంగా 15 మెడికల్ కళాశాలలు,16 ట్రిపుల్ మంజూరు చేస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టారని దుయ్యబట్టారు. కొత్తగా 7 ఐఐఎంలు మంజూరు చేస్తే మనకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు.

పచ్చి అబద్ధాలు, మోసాలు, కులాలు, మతాల మధ్య రాజకీయాలు చేస్తున్నారని కెటిఆర్ మండి పడ్డారు. నేత కార్మికులపై ముసలీ కన్నీరు కారుస్తున్న నేతలకు నేతన్ననలపై జిఎస్‌టి పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం మీది కాదా అని నిలదీశారు. ఇటీవల దేశ వ్యాప్తంగా చేనేత సమూహాలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వంకు నారాయణపేట, గద్వాల, కొత్తకోటకు ఒక్క చేనేత సమూహం ఎందుకు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం కొత్త దుకాణం తెరిచిందని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణా ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తుంటే కేంద్రానికి నచ్చడం లేదని ఆరోపించారు. మీరు ఉచిత కరెంట్ ఇవ్వద్దని ఆదేశిస్తున్నారు. రైతులు మోటార్లు వద్ద మీటర్ పెట్టాలని మోడీ విద్యుత్ చట్టం తీసుకొస్తున్నారని, మీటర్లు పెట్టుకోక పోతే డబ్బులు ఇవ్వమని మోడీ అంటున్నారని.. అప్పులు కూడా ఇవ్వమని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణాకు రావాల్సిన రూ. 25 వేల కోట్లులో పైసా ఇవ్వమని అంటున్నారని.. నేను బతికున్నంత కాలం రైతు మోటార్ పెట్టే ప్రసక్తే లేదని కెసిఆర్ స్పష్టం చేస్తున్నారని కెటిఆర్ గుర్తు చేశారు.

కేంద్రం ఇచ్చినా ఇవ్వక పోయిన ఉచిత విద్యుత్ ఇస్తామని కెసిఆర్ తేల్చి చెప్పారని కెటిఆర్ తెలిపారు. ఇటీవల ఇంకోయన వచ్చారు. అయనకు ఏమి తెలియదు. ఎడ్లు, వడ్లు అంటే కూడా తెలియదు. ఆయనకు తెలిసిందంతా పబ్‌లే. ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడు. ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చాడో తెలియదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. 12 వందల మంది పిల్లల ఆత్మహత్యల పోరాటంతో తెలంగాణా వచ్చింది. అంతమంది చనిపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ధ్వజమెత్తారు. ఆయన చంపి ఆయనే మెసలీ కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. ఇంకో ఆయన ఒక్క సారి అధికారం ఇవ్వాలని అడుగుత్నునారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణా స్వాలంభన కోసం టిఆర్‌ఎస్ తప్ప ఇతర పార్టీ లేదని తెలిపారు. ఈ బహిరంగసభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, లక్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి, పట్నం నరేంద్ర రెడ్డి, గువ్వల బాలరాజు, ఆంజయ్య యాదవ్, ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌సిలు వాణిదేవి, దామోదర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News