Sunday, April 28, 2024

వినూత్న ఇంక్యుబేటర్ల సృష్టికర్తలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ప్రతిరూపాలైన టి..హబ్, తెలంగాణ డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశంసల జల్లు కురిపించారు. అంకురాలను ప్రోత్సహించేందుకు ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రభావవంతమైన మద్దతు వ్యవస్థ కలిగి ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. ఈ విధానాలకు వెన్నెముకగా నిలిచిన సిఎం కెసిఆర్‌తో పాటు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఐటి రంగంలో సాధించిన అభివృద్ధి, దాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు, ఐటి పరిశ్రమ భాగస్వామ్యం వంటి అంశాలపైన గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ఐటి వ్యవహారాలపైన ఏర్పాటయిన పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోంది. కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి, తమిళనాడు శివగంగ ఎంపి కార్తి చిదంబరం, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, కర్ణాటక ఎంపి తేజస్వీ సూర్యతో కూడిన పలువులు ఎంపిల బృందం ఇన్నోవేషన్ ఎకోసిస్టం అధ్యయనంలో భాగంగా హైదరాబాద్ టిహబ్ సందర్శించారు.

గత రెండు రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్న కమిటీ సభ్యులు హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులతో పాటు ఇతర అంశాలపైన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్‌పైన స్థాయి సంఘానికి వివరాలు అందించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసలు కురిపించింది. ఖచ్చితంగా రానున్న కాలంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు. ఎక్కడయన ఆదర్శవంతమైన కార్యక్రమాలు కొనసాగితే వాటి ద్వారా నేర్చుకొని, ప్రజాసంక్షేమం కోసం వాటిని అమలు చేసే విషయంలో ముందు ఉండాలన్న ఉద్దేశ్యమే తమదన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టుల పైన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. సమావేశానంతరం కమిటీ అధ్యక్షులు శశిథరూర్ తోపాటు మిగిలిన పార్లమెంట్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపిన మంత్రి కెటిఆర్ ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు.
శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలోపర్యటిస్తున్న సందర్భంగా ఐటికి సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలు వాటికి సంబంధించిన అంశాలపైన కెటిఆర్ సంఘానికి వివరించారు. పార్లమెంటరీ కమిటీ అధ్యయనం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కెటిఆర్,ఐటి శాఖ విభాగాల అధిపతులు పార్లమెంట్ సంఘానికి వివరించారు.
పార్లమెంట్ సంఘానికి వివరించిన వాటిల్లో…
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టిఎస్..ఐపాస్ ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటి పరిశ్రమ తో కలసి ప్రభుత్వం పని చేయడం వలన అనేక పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని కెటిఆర్ వివరించారు. ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన అమెరికా తరువాత అతిపెద్ద క్యాంపస్‌లు నాలుగు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఐటి ఎగుమతులను సైతం భారీగా పెంచగలిగమన్నారు. అలాగే హైదరాబాద్ నగరం ఐటి రంగంలో వృద్ది సాధించడానికి ప్రభుత్వం తరఫున చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలపైన వివరాలు అందించారు. అలాగే ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంకుబేటర్‌ల వివరాలు అందజేశారు. టి..హబ్, వి..హబ్, అగ్రి హబ్, బి..హబ్, రిచ్, టి.. వర్క్ వంటి కార్యక్రమాలను వివరించారు.
వీటితో పాటు పార్లమెంటరీ స్థాయి సంఘం అత్యంత ఆసక్తిగా అడిగిన డిజిటల్ ఎకానమీ, గవర్నన్స్‌లో ఐటి టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన వివరాలను కూడా కెటిఆర్ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టి వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క భారత్ నెట్ ప్రోగ్రాం ని మరింతగా విస్తరించి చేపట్టిన ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా టి ఫైబర్ ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా దీనికి ప్రత్యేకంగా కేంద్రం మద్దతు ఇవ్వాల్సిన విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి విన్నవించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న డ్రోన్ ప్రాజెక్టు, హరితహారంలో డ్రోన్ల వినియోగం, సైబర్ సెక్యూరిటీ కి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకు రానున్న విషయాలపై కూడా కెటిఆర్ వివరించారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు ఏర్పాటు చేసిన ధరణికి వినియోగిస్తున్న టెక్నాలజీ, దాని పని తీరుపైన వివరాలు అందించారు.
తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపించేలా ఇక్కడి విధానాల పైన ప్రత్యేక సిఫార్సు చేయాలని కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఐటి శాఖ మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఐటిఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టుని లేదా అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో ఈ కమిటీ సహకరించాలని కోరారు.
మంత్రి కెటిఆర్‌పై ప్రశంసలు
తెలంగాణ ఐటి హబ్ పనితీరును పశ్చిమ బెంగాల్‌కు చెందిన టిఎంసి ఎంపి ఫైర్‌బ్రాండ్ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ సెంటర్‌ను త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ ఫుల్ జాబ్ ఆల్ అరౌండ్ కెటిఆర్ అంటూ ఆమె ప్రశంసించారు. కాగా దీనికి ప్రతి స్పందనగా థ్యాంక్యూ మహువా మోయిత్రా అంటూ మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు.

MP Shashi Tharoor visits Hyderabad T-Hub

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News