ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తనను డబ్బులతో కొనగలిగే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదన్నారు. పశ్చిమబెంగాల్ ఓటర్లను విడదీయడం కోసం బిజెపి కోట్లు వెచ్చించి హైదరాబాద్ పార్టీని తీసుకు వస్తోందని సిఎం మమతాబెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా మమత బెనర్జీ ఆరోపణలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సిఎం మమత ఆరోపణలు నిరాధారమని, ఆమె ఒత్తిడితో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. తృణమూల్ నాయకులు బిజెపిలోకి వెళుతున్నారని, మొదట సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని పశ్చిమబెంగాల్ సిఎంకు అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. ఎంఐఎం పార్టీకి ఓటేసిన బీహార్ ప్రజలను మమతా బెనర్జీ అవమానించారని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీచేసి ఏఐఎంఐఎం పార్టీ సీమాంచల్ ప్రాంతంలో 5 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఎంఐఎం ఆసక్తి చూపుతోంది.