న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పంచఘర వద్ద ఎన్ఐఎ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి ముస్లిం యువకులను లక్ష్యంగా చేసుకుని వారిని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జెఎంబి)లో చేర్పిస్తున్న ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని అరెస్టు చేశారు. పంచ్ఘరలో నివసిస్తున్న బంగ్లాదేశ్లోని బరిసల్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ మన్నన్ బచ్చును మంగళవారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఎలెక్ట్రానిక్ పరికరాలు, నకిలీ భారతీయ వోటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు వంటివి లభించాయి. వీటితో అతను బంగ్లాదేశీయులకు భారత్లో నకిలీ గుర్తింపు కార్డులు సమకూరుస్తున్నాడని అధికారులు చెప్పారు. ఆన్లైన్ ద్వారా అతను తప్పుదారి పట్టిన ముస్లిం యువకులను జెఎంబి, అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్(ఎక్యుఐఎస్)లో సభ్యులుగా చేరుస్తున్నాడని వారు చెప్పారు.