ఫలితాలకు ముందే ప్రకటించిన ఎన్ఎల్డి
యాంగాన్: మయన్మార్లోని అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డి) ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తిరిగి అధికారం చేపడుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఫలితాలు ప్రకటించకముందే అధికార పార్టీ ఈ రకమైన ప్రకటన చేయడం గమనార్హం. 642 స్థానాలతో కూడిన పార్లమెంట్లో తమ పార్టీకి 322 స్థానాలకు మించి గెలుపు లభించనున్నట్లు ఎన్ఎల్డి ప్రతినిధి మోనివా ఆంగ్ షిన్ వెల్లడించారు. మొత్తం 377 స్థానాలు గెలుచుకుంటామని ఆశిస్తున్నామని, అంతకన్నా ఎక్కువ కూడా లభించే అవకాశం ఉందని షిన్ చెప్పారు. వోటింగ్ శాతంపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ పూర్తి ఫలితాలు ప్రకటించడానికి వారం రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. 2015లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎన్ఎల్డి నాయకురాలు ఆంగ్ శాన్ సూకీ కౌన్సలర్గా పిలుచుకునే ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. అయితే గత ఎన్నికల్లో అల్పసంఖ్యాకవర్గాలకు చెందిన పార్టీలతో జతకట్టిన ఎన్ఎల్డి ఈసారి ఎన్నికల్లో వాటితో తెగతెంపులు చేసుకోవడంతో ఈసారి ఎన్నికల్లో కొంతమేరకు క్షీణించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.