న్యూఢిల్లీ: 2024 నుంచి వెయిటింగ్ లిస్ట్ అనే నిబంధనను తొలగించే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్లో ప్రయాణిలు ఉండాల్సిన అవసరం లేకుంగా రైల్వేల సామర్థాన్ని పెంచేందుకు చర్యలు చేపడ్తామని తెలిపింది. డిమాండ్కు తగినంతగా రైల్వేల లభ్యత కోసం ప్రయత్నిస్తామని తెలిపింది. వెయిటింగ్ లిస్ట్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడమంటే పూర్తిగా తొలగించడం కాదని రైల్వేశాఖ తెలిపింది. జాతీయ రైల్ ప్రణాళిక అనేది దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రణాళిక అని రైల్వేశాఖ పేర్కొన్నది. ఈ ప్రణాళికను వివిధ మంత్రిత్వశాఖలకు పంపించి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని తెలిపింది. 2021 జనవరికల్లా ప్రణాళికకు తుదిరూపు ఇస్తామని తెలిపింది. ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి ప్రైవేట్ సెక్టార్, పిఎస్యులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరికరాల తయారీ పరిశ్రమల తోడ్పాటును కూడా తీసుకోనున్నట్టు తెలిపింది.