గాంధీనగర్: ఓ మహిళకు నర్సు బాబు పుట్టాడని చెప్పి వెళ్లేటప్పుడు పాపను చేతికిచ్చిన సంఘటన గుజరాత్లోని సోలా గవర్నమెంట్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళకు పురటి నొప్పులు రావడంతో సోలా గవర్నమెంట్ ఆస్పత్రికి ఆమెను భర్త తీసుకొచ్చాడు. గర్భిణీకి నెలలు నిండడంతో ఆస్పత్రి సిబ్బంది ఆపరేషన్ థియోటర్కు తరలించారు. నర్సు వచ్చి ఆ దంపతులకు బాబు పుట్టాడని చెప్పింది. మళ్లీ 30 నిమిషాల తరువాత వచ్చి బాబు కాదు పాప పుట్టిందని సమాధానం ఇవ్వడంతో దంపతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే దంపతులు వెళ్లి సోలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురికి డిఎన్ఎ టెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీస్ అధికారి జెవి రాథోడ్ తెలిపాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పినా సోని మీడియాతో మాట్లాడారు. ఆ రోజు ఒక్క మహిళకే మాత్రమే ప్రసవం చేశామని తెలిపింది. నర్సు హడావుడిలో తప్పుడు సమాచారం ఇచ్చిందని పేర్కొంది. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ స్పష్టం చేసింది.