జపాన్ ప్రధాని షింజో అబే
టోక్యో: ఈ ఏడాది తమ దేశంలో జరిగే ఒలింపిక్ క్రీడలు షెడ్యూల్ ప్రకారమే సాగుతాయని, దీన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) ఈ క్రీడలను వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి సూచించింది. అంతేగాక ఇటీవలే అమెరికా అధ్యక్షుడు కూడా ఒలింపిక్ క్రీడలను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ ప్రధాని షింజో చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రీడల కోసం తాము ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నామని ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయడం కానీ, వాయిదా వేయడం జరుగదని స్పష్టం చేశారు.
కరోనా వ్యాధి ఉన్నా క్రీడలను విజయవంతం నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడలకు హాజరయ్యే క్రీడాకారులకు, సిబ్బందికి, కోచ్లకు, విదేశి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. క్రీడల ప్రారంభానికి ముందే కరోనా వ్యాధి తగ్గు ముఖం పడుతుందనే నమ్మకాన్ని జపాన్ ప్రధాని షింజో వ్యక్తం చేశారు. ఇదిలావుండగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం మాత్రం అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తమకు క్రీడల నిర్వహణ కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఒలింపిక్స్ సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది.