మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలన్నీ మూతపడిన నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో టి సాట్ టివి ద్వారా ఇంటి వద్దనే విద్యార్థులకు బోధన అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టివి పాఠాలు ఈ నెల 24 నుంచి మే 30 వరకు వివిధ సబ్జెక్టు టీచర్ల ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. 30 రోజుల పాటు సాగే ఈ ఆన్లైన్ పాఠశాలు ప్రతి రోజు నాలుగు సబ్జెక్టులలో ఒక్కొక్క గంట చొప్పున ప్రతి సబ్జెక్టులో ఎంపిక చేయబడ్డ అంశాల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని విషయాలను గొలుసుకట్టుగా సమగ్రంగా, సులభంగా విద్యార్థులకు వివరిస్తూ వినూత్నంగా సాగబోతున్నాయని పేర్కొన్నారు.
వీటిలో తెలుగు నుంచి సోషల్ సబ్జెక్టులతో పాటు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, గేమ్స్, స్పోర్ట్, ఆరోగ్య విషయాలకు సంబంధించిన పాఠాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయని అన్నారుర. అనూహ్యంగా ఏర్పడిన కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనం కోసం సరికొత్త పద్దతిలో నిర్వహించే ఈ ఆన్లైన్ పాఠాలు తెలంగాణ పాఠశాల విద్యారంగంలో చేసే ఒక వినూత్న ప్రయోగవచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకాశాన్ని సాంఘిక, గిరిజన గురుకుల సంస్థలకు అందించిన ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావుకు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ,ఎస్టి సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఈ టిసాట్ ఆన్లైన్ పాఠాలను చూస్తూ వింటూ వచ్చే విద్యాసంవత్సరానికి సిద్దంగా ఉండాలని కోరారు.