పేటిఎం, గూగుల్ పేతో మోసం చేస్తున్న యువకులు
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నకిలీ పేయాప్లతో డబ్బులు చెల్లింపులు చేసి మోసం చేస్తున్న ఎనిమిది మంది యువకులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని దబీర్పుర, ఫర్హాత్ నగర్కు చెందిన ఎండి ముస్తఫా హుస్సేన్ ముజాకిర్, ఆసిఫ్నగర్కు చెందిన సయిద్ అమీర్ హసన్ అలియాస్ అమీర్, సయిద్ ఇలియాస్, సయిద్ వాజిద్ అలీ, హఫీజ్ రాణా, ఎండి సల్మాన్, ఎండి అబ్దుల్లా షాహెద్, ఎండి యూసుఫ్ కలిసి మోసం చేస్తున్నారు. ఎనిమిది మంది నిందితులపై గతంలో కంచన్బాగ్, చాంద్రాయణగుట్ట, మీర్చౌక్లో కేసులు ఉన్నాయి.
ఎనిమిదిమంది యువకులు నకిలీ పేటిఎం, గూగుల్పే యాప్లను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. వివిధ స్టోర్లు, షాపులకు వెళిల వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. షాపుల యజమానులకు పేటిఎం స్పూప్ ద్వారా నకిలీ పేమెంట్ చేస్తున్నారు. నకిలీ యాప్లో బిల్లు చెల్లించినట్లు రావడంతో షాపుల యజమానులు తమకు వచ్చినట్లు భావించి వదిలేస్తున్నారు. ఈ విధంగా చాలా ప్రాంతాల్లో షాపింగ్ వేలాది రూపాయలు మోసం చేశారు. నిందితులు యూట్యూబ్లో వీడియోలు చూసి ఎలా మోసం చేయవచ్చో తెలుసుకున్నారు. వాటి ఆధారంగా మోసం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కంచన్బాగ్, చాంద్రాయణగుట్ట, టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి నిందితులను అరెస్టు చేశారు.