Monday, April 29, 2024

పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే… పంచాయతీరాజ్ గ్రూప్

- Advertisement -
- Advertisement -

త్వరలోనే పిఆర్ ప్రత్యేక వెబ్‌సైట్
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్ : స్థానిక సంస్థల రాష్ట్ర వ్యాప్త మాజి ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే పంచాయతీరాజ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. మంగళవారం మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల మాజి ప్రజా ప్రతినిదులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ లోక సభ, రాజ్యసభలలో సిట్టింగ్, మాజి ఎంపిల కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ గ్రూప్ ఉంటుందని , ఈ గ్రూప్ ద్వారా ఉభయ పార్లమెంటరీ సభల్లో జరిగే ముఖ్య ఘటనల సమాచారం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు సభ్యులు సమాచారం కోసం ఈ గ్రూప్ ద్వారా ఎప్పికప్పుడు సమాచారాన్ని అందజేస్తుంటారని వినోద్ కుమార్ తెలిపారు.

పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల మాజి ప్రజా ప్రతినిధులకు కూడా పంచాయతీరాజ్ గ్రూప్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచిగా, ఎంపిటిసి సభ్యులుగా, జెడ్‌పిటిసి సభ్యులుగా, ఎంపిపి అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి రిజర్వేషన్ రోష్టర్ వల్ల కాని ఎన్నికల్లో ఓటమి చెందడం వల్ల కాని తిరిగి పోటీ చేయలేక పోవడం వంటి కారణాల వల్ల మాజీలుగా ఉంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలకు అతీతంగా ఒకే విదిక ఉండే విధంగా పంచాయతీరాజ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యత ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ అంశాలు, ఉత్తర్వులు, స్థానిక సంస్థల సమగ్ర సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించేందుకు పంచాయతీరాజ్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సమాచారాన్ని గ్రామస్థులకు చేరవేయడానికి పంచాయతీరాజ్ గ్రూప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. పంచాయతీరాజ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా స్థానిక సంస్థల మాజి ప్రజాప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ భేటిలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడి శంకర్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ధరావత్ పూల రాణి, సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, సుంకన్న, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News