న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ, కోల్కతాల్లో రూ.99కి చేరింది. పెట్రోల్ ధర రూ.100 దాటని మెట్రో నగరాలు ఈ రెండే అన్నది గమనార్హం. ఈసారి డీజిల్ ధరను మాత్రం పెంచలేదు. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.13కి చేరింది. డీజిల్ ధర రూ.93.72 వద్ద నిలకడగా ఉన్నది. పంజాబ్లోని జలంధర్లో రూ.100.22కు, కేరళలోని తిరువనంతపురంలో రూ.101.14కు చేరింది. జూన్ నెలలోనే ముంబయి,బెంగళూర్,హైదరాబాద్,పూణె నగరాల్లో రూ.100 దాటింది. దీంతో, రూ.100 మార్క్ దాటిన రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్మూకాశ్మీర్, ఒడిషా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, లడఖ్ చేరాయి. రాష్ట్రాల్లో వేర్వేరు ధరలకు కారణం స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలుండటమే. ఇటీవల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం కూడా కారణమని చెబుతున్నారు. 2019 ఏప్రిల్ తర్వాత మొదటిసారి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 75 డాలర్లకు చేరింది. రాష్ట్రాల ఎన్నికల తర్వాత మే 4నుంచి 33సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఈ కాలంలో లీటర్ పెట్రోల్ ధర రూ.8.76 మేర, డీజిల్ ధర రూ.8.45మేర పెరిగింది.