ఫేస్బుక్లో ఇంజనీరింగ్ కాలేజీపై ఫేక్ న్యూస్
హైదరాబాద్: ఉద్యోగంలో నుంచి తీసివేశారని కక్ష పెంచుకుని ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… తమిళనాడు రాష్ట్రం కోయంబత్తురు, శక్తి నగర్కు చెందిన సిరాజుద్దిన్ ఘట్కేసర్లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. నిందితుడికి కాలేజీ చైర్మన్కు మధ్య వేతనం విషయంలో కొద్ది రోజుల క్రితం గొడవలు జరిగాయి. కొంత కాలం పనిచేసిన తర్వాత నిందితుడు ఉద్యోగం మానివేశాడు. దీనిని మనసులో పెట్టుకుని చైర్మన్ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాను ఓపెన్ చేసి అసభ్యమెసేజ్లు, అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇది గమనించి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ ప్రకాష్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.