Monday, April 29, 2024

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -
  • బడిబాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యవైపు చొరవ చూపుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, జడ్పి చైర్‌పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డిలు హాజరయ్యారు.

బడిబాట కార్యక్రమంలో కొత్తగా చేరిన విద్యార్థులకు పలకలు అందజేసి అక్షరాభాస్యం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్ల ఖర్చుచేసి డిజిటల్ విద్యాబోధన వైపు అడుగులు వేస్తున్నామన్నారు. కార్పొరేట్ విద్యకు తీసిపోకుండా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి యేటా విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణి కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలిపారు. 150 కోట్ల రుపాయలతో ఒక్కొ విద్యార్థికి 2 జతల బట్టల అందిస్తున్నామన్నారు. 35 కోట్ల రూపాయలతో ఉదయం పూట రాగి జావ అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులకు మరింత ఉపయోగపడే విధంగా వర్క్ బుక్స్‌ను ఉచితంగా అందించడానికి నిర్ణయించారని, దీని రాష్ట్రంలో 24 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు.

నోట్ బుక్స్, వర్క్ బుక్స్‌ల పంపిణీ ఈ నెల 20న విద్యా దినోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందించనున్నారు. మన ఊరుమన బడి కార్యక్రమంలో 12 విభాగాల్లో పనులు పూర్తైన వెయ్యి పాఠశాలలను విద్యా దినోత్సవం సందర్బంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ గుడిని, బడిని ఒకేలా చూసి స్థానికులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News