మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని ఎపి మాజీ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనకున్న అధికార పరిధిలోనే ఆ లేఖ రాశానని, దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా ఈ లేఖను నిర్ధారించారని, ఇంకా దీనిపై ఎలాంటి వివాదాలు, రాద్దాంతాలకు తావు లేదన్నారు. తాను రాసిన లేఖపై థర్డ్ పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ధృవీకరించారని, హోంశాఖకు సమాచారం తన పరిధిలోని అంశమని దీనిపై వివాదం అనవసరమని రమేష్కుమార్ స్పష్టం చేశారు.కరోనా వైరస్ కారణంతో ఎపిలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పటి నుంచి ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. తనకు అదనపు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రమేష్కుమార్ రాసిన లేఖపై రాజకీయ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.