Monday, April 29, 2024

నేను శూద్రుడిని అందుకే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్లమెంటు సమావేశాల్లో సోమవారం కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య వాడిగా, వేడిగా వాదం జరిగింది. కొశ్చన్ అవర్‌లో ఎంపి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. రూపాయి విలువ పతనం, బలోపేతం గురించి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి హిందీ భాష గురించి కామెంట్ చేశారు. బలహీనమైన హిందీ భాషలో ప్రశ్న వేసిన రేవంత్‌కి అదే బలహీనమైన భాషలోనే సమాధానం చెబుతా అంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభను గంభీరంగా మార్చేశాయి.

తాను శూద్రుడిని కాబట్టి, స్వచ్ఛమైన హిందీ తనకు రాదని, కానీ, వారు బ్రాహ్మణవాదులు కాబట్టి శుద్ధమైన హిందీ వచ్చు అని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన ప్రశ్నలో నరేంద్రమోడీని ప్రస్తావించారు. గుజరాత్ సిఎంగా ప్రస్తుత మోడీ ఉన్న కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి విలువ గురించి ప్రశ్నించారని, ఇప్పుడు తాను అదే ప్రశ్న వేస్తున్నానని రేవంత్ అన్నారు. అప్పుడు డాలర్‌కు రూపాయి విలువ 60 నుంచి 70 మధ్యలో ఉందని, అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకెళ్లిందని నరేంద్ర మోడీ అడిగారని ఉటంకిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా మార్చురీకే తీసుకెళ్లుతున్నదా? అని ప్రశ్నించారు.

రూపాయిని మళ్లీ బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లాన్ ఏది అని అడిగారు. ఇందుకు సమాధానం ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌కు అనుమతి ఇచ్చారు. తాను కూడా అదే తెలంగాణ నుంచి వచ్చానని, కానీ, రేవంత్ రెడ్డి బలహీనమైన హిందీ భాషలో తనకు ప్రశ్న వేశారని ఆమె అన్నారు. కానీ, తనకు హిందీ భాష వచ్చు అని తెలిపారు. అయితే ఆ బలహీనమైన హిందీ ప్రశ్నకు తాను బలహీనమైన హిందీ భాషలోనే సమాధానం చెబుతానని వివరించారు.

ఆ తర్వాత అప్పటి ఆర్థిక వ్యవస్థ, ఇప్పటి ఆర్థిక వ్యవస్థ కాలాలు, పరిస్థితులు వేరు అని తేడాలు చెప్పారు. కేవలం రూపాయి మారకం విలువనే కాదు ఇతర సూచీలను ప్రస్తావిస్తే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. అప్పటి ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోనే ఉందని, తామే దాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని వివరించారు.అనంతరం, కరోనా మహమ్మారి వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొని వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం,రేవంత్ రెడ్డి నిలబడి నిర్మలా సీతారామన్ తన భాషపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన భాషపై అలా మాట్లాడటం సరి కాదని అన్నారు. తాను శూద్రుడినని అందుకే తనకు శుద్ధమైన హిందీ భాష రాదని తెలిపారు. కానీ, నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ వాది కాబట్టి, శుద్ధమైన హిందీ భాష వస్తుందేమో అని పేర్కొన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా తర్వాత చట్టసభ్యులకు ఓ హెచ్చరిక చేశారు. జాతి, ధర్మం, కులం, ప్రాంతం ఆధారంగా ఎన్నికై ఇక్కడకు రాలేదని, ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడకు వచ్చారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.కాబట్టి, ఇక్కడ జాతి, మతం, ప్రాంతం వంటి ఆధారంగా కామెంట్లు చేయ రాదని, అలా చేస్తే వారిపై దర్యాప్తునకు కూడా ఆదేశించగలను అని, ఇది ఆన్ రికార్డులో ఇస్తున్న హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లోనూ చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News