Monday, April 29, 2024

నిమజ్జనంపై నేడు రివ్యూ పిటిషన్

- Advertisement -
- Advertisement -

Review Petition today on Ganesh immersion

ఈ సంవత్సరం కూడా పిఒపి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరనున్న ప్రభుత్వం
నిమజ్జనం తర్వాత 48గంటల్లో తొలగిస్తామని నివేదించనున్నట్టు వెల్లడి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ సంవత్సరం కూడా యధావిధిగా హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని రాష్ట్ర హైకోర్టుకు విన్నవించినట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈక్రమంలో ప్రభుత్వం తరపున సోమవారం నాడు హై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదివారం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హై కోర్టు ఆదేశించిందని, అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో నలుదిక్కుల ఇప్పటికి ఇప్పుడు పాండ్స్ ఏర్పాటు చేయడం అంటే ఎంతో కష్టం అని అన్నారు.

జిహెచ్‌ఎంపి పరిధిలో సుమారు 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని, ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదని వివరించారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని పెద్ద మనసుతో ఈ సంవత్సరం యధావిధిగా విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోర్టు ను కోరుతున్నట్లు చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం తో ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. విగ్రహాల నిమజ్జనం జరిగిన 48 గంటలలో వ్యర్ధాలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గణేష్ శోభ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి వెంట ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, చైర్మన్ సుదర్శన్ తదితరులు ఉన్నారు.

గణేశ్ నిమజ్జన ఉత్తర్వులపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ

వినాయకుల నిమజ్జనంపై తీర్పుపై ఆదివారం నాడు న్యాయమూర్తి ఇంట్లో అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. హౌజ్‌మోషన్‌కు అనుమతి నిరాకరించిన హైకోర్టు సోమవారం ఉదయం ప్రస్తావిస్తే లంచ్ మోషన్ విచారణకు పరిశీలిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈక్రమంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం తరఫున సోమవారం హౌజ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గణేశుల నిమజ్జనం యథావిధిగా చేసుకునేలా హైకోర్టు అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని కోరనున్నట్లు తెలిపారు. వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పునిచ్చిందని, తీర్పు వచ్చేటప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయని మంత్రి తలసాని తెలిపారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేయటం అసాధ్యమని, హైదరాబాద్‌లో కుంటల ఏర్పాటు ఇబ్బందితో కూడుకున్న విషయం తెలిసిందేనన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని హైకోర్టు అర్థం చేసుకోవాలని, భవిష్యత్‌లో కోర్టు ముందస్తు ఆదేశాలు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. ధర్మాసనం పెద్దమనసు చేసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News