హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. బుద్ధభవన్లో జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఎన్ఆర్డిపితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు జరిపారు. కేంద్ర సడలింపుల నేపథ్యంలో చేయాల్సిన పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది వర్కింగ్ సీజన్ అని, ఒక నెలపాటు పనులు చేయవచ్చని, జూన్ నుంచి వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో లాక్డౌన్ను చక్కగా వినియోగించుకున్నా రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందన్నారు. మే నెలలో మరిన్ని పనులను ప్రారంభిస్తామని, లింక్ రోడ్లలో ఆటంకాలు ఉన్న చోట భూ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్వాసితులు పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని కెటిఆర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.