మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఇఎస్ఐ కుంభకోణంలో గత టిడిపి ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి వెంకట్రెడ్డి వెల్లడించారు. మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం ఎస్పి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టెలీసర్వీసెస్కు చెందిన కాల్లిస్ట్ ఆంధ్రప్రదేశ్ది కాకుండా తెలంగాణాది ఇచ్చారని తెలిపారు. ఆ కాల్లిస్టును పరిశీలించగా బోగస్అని తేలిందన్నారు. అలాగే పేషెంట్స్ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని ఆయన తెలిపారు. సీవరేజ్ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినప్పటికీ పాత ఆస్పత్రిలోని ప్లాంట్పేరుతోనే బిల్లులు పొందారని వివరించారు.
ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారని వెల్లడించారు. నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారని, అనవసర మందులు కొన్నారని ఆయన వివరించారు. కొనుగోలు చేసిన మందులను వినియోగించలేదని, చాలా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్కే పరిమితమయ్యాయి వెల్లడించారు. అవసరానికి మించి మందులు కొనుగోలు చేశారని, చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.
ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. 3 నెలల పాటు విచారణ జరిపామని, గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారని, ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉందని తెలిపారు. కాగా, గత టిడిపి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పేర్లు ఇఎస్ఐ కుంభకోణంలో వినిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.