Monday, April 29, 2024

మహిళల విద్యకు దారి దీపం

- Advertisement -
- Advertisement -

మనకు సేవా రంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు. వారి స్థాయిలో, వారి కంటే ముందుగానే సావిత్రి బాయి ఫూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి పునాది వేశారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫూలే పేరు పొందారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె తన తొమ్మిదవ ఏటనే పన్నెండేళ్ళ జ్యోతిరావు ఫూలేతో 1840లో వివాహం జరిగింది. నిరక్షరాస్యులైన ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో వారి వద్దనే విద్యనభ్యసించి, విద్యావంతురాలు అయింది. ఉపాధ్యాయ శిక్షణపొంది, 1848 జనవరి 1న భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి అణచివేతకు గురైన కులాల బాలికల కోసం పుణెలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించింది.

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఎదిరించి, విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి, గెలిచారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించి, విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. జీవిత కాలం మొత్తంలో 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య భావజాలం గల వారి నుండి అనేక దాడులు, అవమానాలను ఎదుర్కొన్నది.ఈ నేపథ్యంలో చివరికి 1849 లో భర్తతో కలిసి గృహ బహిష్కరణకు గురి కావలసి వచ్చింది. స్త్రీ, పురుషులు కులమతాలకు అతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కు అని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవమూర్తి సావిత్రి బాయి.

ఆమె మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి, స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనబడే మహిళా సంఘాన్ని స్థాపించింది. లింగ వివక్షలకు తోడుగా కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా, స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ పని చేసేది. మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత సావిత్రి బాయి ఫూలే. అసత్యాలతో అగ్రవర్ణాల దురహంకారపు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త జ్యోతి బాఫూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్‌ను ప్రారంభించింది. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాల కోసం బలమైన ఉద్యమాన్ని నడిపారు. దాని మహిళా విభాగం సావిత్రి బాయి ఫూలే ఆధ్వర్యంలో నడిచేది. పురోహితులు లేకుండా వివాహాలు, ఇతర శుభకార్యాలను ఈ సంస్థ ద్వారా చేసేవారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్న ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు.

గర్భవతులైన వారికి పురుళ్లు పోసి, వారి జీవితాలకు వెలుగు నిచ్చారు. ఆ విధంగా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకుని యశ్వంత్‌గా పేరు పెట్టి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పెంచి పెద్ద చేశారు. డాక్టర్ గా సమాజానికి అందించారు. వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాక, క్షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోముండనం చేయబోమని వారి చేత 1860లో సమ్మె కూడా చేయించారు. 1870లో ఒకసారి, 1896లో మరొకసారి దేశంలో తీవ్ర కరువు ఏర్పడినప్పుడు ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం. కరువువాత పడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేల మందిని అక్కున చేర్చుకొని వారికి తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందిచారు. మరో మిత్రురాలు ఫాతిమా బేగంతో కలిసి విద్యా విప్లవానికి నాంది పలికారు. ఆంగ్ల విద్యని నేర్చుకోవడం ద్వారా బహుజనులు తమ హక్కుల గురించి తెలుసుకోగలుగుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

1890లో భర్త జ్యోతిరావ్ ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి, అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సావిత్రీ బాయి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా గొప్ప రచయిత్రి. 1854లో కావ్య ఫూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా, ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్ కాశీ సుభోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసే వాళ్ళను విమర్శిస్తూ ‘కర్జ్’ అనే వ్యాసం రాశారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి తన కవితల్లో హేతుబద్ధత ప్రతిబింబించే విధం గా రచనలు చేశారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారత దేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటుంది.

1897లో ఆమె మరణం కూడా ప్రజా సేవలోనే పొందింది. పుణె నగరంలో ఒక వీధిలో ప్లేగు వ్యాధి భయంకరంగా విలయతాండవం చేస్తున్న రోజులు. ఆమె వ్యాధిగ్రస్థులకు సేవ చేస్తున్న క్రమంలో పాండు రంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారినపడడం గమనించి, ఆసుపత్రికి తీసుకు వచ్చేవారు ఎవరూ లేక స్వయంగా తానే తన 66వ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకొని, ఆసుపత్రికి తీసుకు వస్తున్న సందర్భంలో ఆ బాలుడి శ్వాస ఆమె పీల్చడం వల్ల తాను కూడ వ్యాధి బారిన పడింది. ఆ బాలుడు బతికాడు కాని, ఆమె మరణించింది. సావిత్రి బాయిని స్ఫూర్తిగా తీసుకొని వివిధ రంగాలలో రాణించిన మహిళలు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. వారు డాక్టర్ ఆనంది బాయి జోషి. ఈమె పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. పండిత రమాబాయి సంఘ సంస్కర్తగా, మహిళల విద్య కోసం, విముక్తి కోసం మార్గదర్శకులుగా గుర్తింపు పొందింది. రమాబాయి రనాడే మహిళా హక్కుల కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. తారాబాయి షిండే సామాజిక కార్యకర్తగా, మహిళా హక్కుల కార్యకర్తగా కృషి చేశారు.

సావిత్రి బాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికీ ఆచరణీయమే. మధ్యాహ్న భోజన పథకం, అందరికీ విద్య, పేరెంట్స్ మీటింగ్స్, సంక్షేమ హాస్టళ్లు, బోర్డింగ్ స్కూల్స్ నిర్వహణ ఇలాంటివి ఎన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎంతైనా తక్కువే. వరకట్నం, గృహ హింస, లైంగిక వేధింపులు వంటివి ఆధునిక కాలంలో కూడా మహిళలపై జరుగుతూనే వున్నాయి. ఆమె ఆదర్శాలను నేటి సమాజంలోని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని మెరుగైన సమాజ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దాం.

యం. రాంప్రదీప్
9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News