Monday, April 29, 2024

అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

‘కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే, అక్కడ అన్నీ కుంభకోణాలే. ఇంతకు ముందు వందల కోట్ల కుంభకోణాలుండేవి, ఇప్పుడవి వేల కోట్లు దాటి, లక్షల కోట్లకు చేరాయి. ఇదీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సాధించిన ఘనత. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆదర్శ్ కుంభకోణం, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ సిఎం వైఎస్సార్ హయాం లో అవినీతి, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఢిల్లీలో కాంగ్రెస్ సిఎంగా షీలా దీక్షిత్ ఉన్నపుడు స్కాములు, అదే విధంగా సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా ప్రమేయంతో 2 జీ స్కాం, కామన్వెల్త్ గేమ్స్ స్కాం, బొగ్గు కుంభకోణం ఇట్లా చెప్పుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నాయి’ ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదు..ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న ముఖ్యనేత. విపక్షంలో ఉన్నపుడు టివి చర్చలో పాల్గొన్న సందర్భం గా ఆయన మాట్లాడిన మాటలు, చరిత్ర చెప్పిన అక్షర సత్యాలు.

అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటతో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగు నీరు లేదు. సాగు నీరు లేదు. కరంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసల్ సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష్కారం అనే మాట కాంగ్రెస్ వాళ్లకు ఏనాడూ పట్టదు. ఇది చరిత్ర తేల్చి చెప్పిన సత్యం అందుకే కాంగ్రెస్‌ను ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తది అంటుంటారు విపక్ష నాయకులు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్లు అవినీతి గురించి మాట్లాడటం అంటే.. పులి శాఖాహారం గురించి మాట్లాడినట్లే ఉంటది మరి. అవినీతిని ఒక కళగా పెంచి పోషించి, వ్యవస్థీకృతం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు, పాత చింతకాయ పచ్చడే. కాంగ్రెస్ నాయకులు నిత్యం స్వప్రయోజనాల కోసం పోట్లాడుకోవడమే తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం పాటు పడటం అనేది వారి చరిత్రలోనే లేదు.ఇకపోతే స్కాంలకు పర్యాయ పదంగా, కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ పార్టీని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ స్కాంల గురించి, అవినీతి గురించి ఈ దేశం లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు.

అవినీతికి మారుపేరుగా మారిన ఆ పార్టీ స్కాంగ్రెస్‌గా ప్రసిద్ధికెక్కింది. అలాంటి స్కాంగ్రెస్‌ను 206 ఎంపి సీట్ల నుంచి 44 సీట్లకు దించారు దేశ ప్రజలు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించలేక చేతులెత్తేసిన జాతీయ నేత రాహుల్ గాంధీ.. 80 వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఖమ్మం సభలో ఆరోపించడం మరీ విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులన్నీ మరిచిపోయి, గురివింద గింజ మాదిరిగా.. సిఎం కెసిఆర్ పక్కన అందరూ కోటీశ్వరులే ఉన్నారని నోరు పారేసుకున్నారు రాహుల్ గాంధీ.మరి తన పక్కన కూడా బడా కాంట్రాక్టర్లు, కోటీశ్వరులున్న విషయంలో ఏమీ తెలియనట్లే నటించాడు రాహుల్. తెలంగాణలో పోడు చేసుకుంటున్న గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలను అందించే ప్రక్రియను సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆరే ప్రారంభించారు. ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇదేమీ తెలియని రాహుల్ గాంధీ గిరిజనులకు పోడు పట్టాలిస్తామని కొత్తగా ప్రకటించడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగాక మరేమిటి?

ఇంద్రవెల్లిలో పోలీసు కాల్పులు జరిపించి అమాయక ఆదివాసీ గిరిజనులను పొట్టన బెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా ఆ రక్త చరిత్రను ప్రజలింకా మరిచిపోలేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇంద్రవెల్లిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోయినట్టు పౌర హక్కుల సంఘం తేల్చగా, ఇంకో 250 మందికి పైగా చనిపోయినట్టు మరో సంఘం చెప్పింది. ఇట్లా 350 మంది ఆదివాసీలను పిట్టల్లా కాల్చేసిన కాంగ్రెస్ నేడు గోముఖ వ్యాఘ్రంలా మాట్లాడుతున్నది. ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలాలివ్వాలని ప్రదర్శన జరుపుతున్న ముదిగొండ ప్రజలపై కాల్పులు జరిపి నిరుపేద ప్రజలను నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక పేదలను ఉద్ధరిస్తామని చెబితే నమ్మడానికి.. తెలంగాణలో ఇంకా అమాయకులెవరూ లేరని గుర్తెరగాలి. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం చేసిన ఖర్చే రూ. 80 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ పసలేని మాటలు మాట్లాడటం కాంగ్రెస్ నేతలకే చెల్లింది.

తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం ఉద్యమించడమేకాదు, ఆ ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది నాటి టిఆర్‌ఎస్ (నేటి బిఆర్‌ఎస్) పార్టీ. సమైక్య పాలనలో దశాబ్దాల కాలం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైన తెలంగాణ ప్రాంతం, కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత, తెలంగాణ పునర్నిర్మాణం కోసం తొమ్మిదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారు సిఎం కెసిఆర్. ఈ క్రమంలో వారెన్నో గడ్డు సమస్యలు ఎదుర్కోవడమే కాదు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాలకూ, అన్ని మతాలకూ మేలు చూస్తూ, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. బిఆర్‌ఎస్ హయాంలో పల్లెలు, పట్టణాలు, నగరాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈ రోజు తెలంగాణలో హనుమంతుని గుడిలేని ఊరు లేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. బిఆర్‌ఎస్సే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. రేపు మళ్లీ వచ్చేది కూడా మానవతకు మారుపేరైన కెసిఆర్ సారే. పేద ప్రజలపై మనసు గల్ల బిఆర్‌ఎస్ సర్కారే.. అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News