విదేశాల నుంచి వచ్చాక 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి
గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, మానసిక స్థితి సక్రమంగా లేని వారు హోం ఐసోలేషన్లో ఉండొచ్చు
ప్రతి ఒక్కరు ఆర్టిపిసిఆర్ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించుకోవాలి
అంతర్జాతీయ ప్రయాణికులకు నూతన మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ సేకండ్ వేవ్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా విమానాల ద్వారా వచ్చే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని కేంద్రం కోరింది. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమాన ప్రయాణీకులు ట్రావెల్కి ముందు, ఎయిర్ఫోర్టుకు చేరిన తర్వాత, జర్నీ సమయంలో, ఇండియాకి చేరిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రయాణానికి ముందు చేయాల్సినవి….
ఏదేని దేశం నుంచి ఇండియాకి రావాలనుకునే వారు తమ సెల్ఫ్ డిక్లరేషన్ వివరాలను www.newdelhiairport.inలో ప్రయాణానికి 72 గంటల ముందు నమోదు చేయాలి. వాటిని సివిల్ అవియేషన్, భారత ప్రభుత్వం అధికారులు పరిశీలించి తదుపరి విధానపరమైన అనుమతి ప్రతాలను ఎయిర్పోర్టు అధికారులకు పంపిస్తారు. అంతేగాక 14 క్వారంటైన్ ఉండేందుకు అనుమతి పత్రాన్ని కూడా ఇవ్వనున్నారు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, మతిస్థిమితం సక్రమంగా లేని వారు ఉంటే అధికారుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్లో ఉండొచ్చు. విదేశాల నుంచి ఇండియాలో ల్యాండ్ అయిన వారిలో లక్షణాలు ఉండి ఆర్టిపిసిఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు లేకపోతే వారిని నేరుగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. అక్కడ 14 రోజులు పాటు ఉండాలి. లక్షణాలు లేని వారు కూడా 7 రోజులు సంస్థాగత, మరో 7 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని కేంద్రం వెల్లడించింది.
ఎయిర్పోర్టుకు చేరిన తర్వాత పాటించాల్సినవి…
ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎయిర్పోర్టు లోపలికి వెళ్లే ముందు ప్రవేశం వద్దనున్న థర్మల్ స్క్రీనింగ్లో టెంపరేచర్ చెక్ చేపించుకోవాలి. ఎయిర్పోర్టులో వ్యక్తికి, మరో వ్యక్తికి భౌతికదూరం పాటించాలి.
ట్రావెల్ చేసే సమయంలో….
ఆన్లైన్లో సెల్ఫ్ డిక్లరేషన్లో ఫాం నింపని వాళ్లు ఉంటే ప్లైట్లో వైద్య, ఇమ్మిగ్రేషన్ అధికారుల సూచనతో వాటిని నింపాలి. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాస్కు, భౌతిక దూరంతో పాటు చేతులను కూడా శుభ్రపరచుకోవాలి.
ఇండియా విమానాశ్రయంలో దిగిన తర్వాత చేయాల్సినవి..
భౌతిక దూరం పాటిస్తూ ప్లైట్ దిగాలి. థర్మల్ స్క్రీనింగ్ చేసే అధికారులకు సహకరించాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంను ఎయిర్ఫోర్ట్లలో ఉన్న హెల్త్ కౌంటర్లలో ఇవ్వాలి.ప్రతి ప్రయాణికుడితో పాటు కుటుంబ సభ్యుల్లో మరో వ్యక్తి సెల్ నంబర్ హెల్త్ అధికారులకు ఇవ్వాలి. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ కాల్ సెంటర్కు తెలియజేయాలి. అయితే క్వారంటైన్ ,ఐసోలేషన్పై రాష్ట్రాలు ప్రోటోకాల్ అభివృద్ధి చేయొచ్చు అని కేంద్రం తెలిపింది. అయితే ఓడల్లో వచ్చే వారు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచించారు. కానీ దీనికి ఆన్లైన్ నమోదు అవసరం లేదని కేంద్రం వెల్లడించింది.