భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. అసెంబ్లీలో కమల్ నాథ్ నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పొయి, రాజీనామా సమర్పించిన తరువాత కొద్దిరోజులకు చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం అంతక ముందు జరిగిన బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 61 సంవత్సరాల శివరాజ్ సింగ్ 2005 2018 మధ్యకాలంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారం కోల్పొయింది. బిజెపికి 109 స్థానాలు , కాంగ్రెస్కు 114 స్థానాలు వచ్చాయి. ఎస్పి, ఇద్దరు బిఎస్పి, ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ఇటీవలే కాంగ్రెస్లో కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపిలో అత్యంత సీనియర్, సిఎంగా అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాం తరువాత తిరిగి బాధ్యతలు స్వీకరించారు.