Monday, April 29, 2024

ఆసియా క్రీడల్లో తెలంగాణ తేజం

- Advertisement -
- Advertisement -

ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ సంచలనం సృష్టించింది. షూటింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించి జాతికి గర్వకారణంగా నిలిచింది. బుధవారం భారత్‌కు ఎనిమిది పతకాలు దక్కాయి. ఇందులో ఏడు పతకాలు షూటింగ్‌లోనే లభించాయి. రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు దక్కాయి.

హాంగ్‌జౌ : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండించింది. బుధవారం భారత్ ఏకంగా 8 పతకాలు సాధించింది. దీనిలో రెండు స్వర్ణాలు కూడా ఉండడం విశేషం. హాంగ్‌జౌ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 22 పతకాలను సొంతం చేసుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, పది కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, భారత్‌కు షూటింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు లభించాయి. వీటిలో 3 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, మహిళల 25 మీటర్ల టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాన్ని సాధించింది. మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్‌లతో కూడిన భారత బృందం ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం దక్కించుకుంది. అసాధారణ ప్రతిభతో అలరించిన సిఫ్ట్ కౌర్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.

తెలుగుతేజం ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతాని దక్కించుకుంది. అసాధారణ ప్రతిభను కనబరిచిన భారత యువ సంచలనం ఈషా తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా, మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం దక్కింది. ఆషి చౌష్కీ, మనిని కౌషిక్, సిఫ్ట్ కౌర్ సమ్రాలతో కూడిన భారత బృందం రెండో స్థానంలో నిలిచింది. కాగా, పురుషుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అనంత్‌జీత్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. అంతేగాక మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఆషి చౌష్కీ కాంస్యం సాధించింది. పురుషుల స్కీట్ టీమ్ షూటింగ్ విభాగంలో కూడా భారత్‌కు కాంస్యం లభించింది. కాగా, సెయిలింగ్‌లో భారత ఆటగాడు విష్ణు శరవణన్ కాంస్యం గెలుచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News