రోజురోజుకూ పెరుగుతున్న కేసులు సంఖ్య
ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యశాఖ
కేసులు తగ్గుముఖం పట్టేందుకు లాక్డౌన్ పకడ్బందీగా అమలు
ప్రజలు సహకరిస్తే వైరస్ను తరిమికొట్టవచ్చని అధికారుల సూచనలు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి చాపకింది నీరులా విస్తరిస్తుంది. అధికారులు ఎంత శ్రమించిన రోజుకు డజన్కుపైగా కేసులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలో పాజిటివ్ కేసులు జీరోకు చేరుకోగా, ఒక గ్రేటర్ పరిధిలోని నెల 1వ తేదీ నుంచి కేసులు సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటి వరకు మహానగరంలో 690 పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది మృత్యువాత పడి 210 మంది గాంధీలో చికిత్స పొంది వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.
ఏప్రిల్ మాసంలో నగరంలో 161 కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 8 కంటైన్మెంట్ జోన్లు, 22 సర్కిల్లో మాత్రమే వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. కామాటిపురా, భవానినగర్, మెహిదీపట్నం, గోల్కొండ, సంతోష్నగర్, మలక్పేట, చాదర్ఘాట్, వనస్థ్దలిపురం, ఎల్బీనగర్, సరూర్నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. నమోదయ్యే కేసుల్లో ఈ ప్రాంతాలకే చెందినవి ఆయా ఏరియాల్లో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేసి ఇంటింటికి వైద్య పరీక్షలు చేస్తామని వెల్లడిస్తున్నారు.
అక్కడ నివసించే ప్రజలు రోడ్లపైకి వెళ్లకుండా 8 మీటర్ల ఎత్తులో బారికేడ్లు ఏర్పాటు చేసి గడప దాటకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు వేగం చేశారు. జీహెచ్ఎంసీ నియమించిన నోడల్ అధికారి పర్యవేక్షణలో వైద్యశాఖకు చెందిన ముగ్గురు సిబ్బంది, పోలీసు విభాగానికి సబ్ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్, హోంగార్డులు విధులు నిర్వహిస్తూ కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులు ఉంటే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలిస్తూ, కుటుంబ సభ్యులను క్వారంటైన్ తరలిస్తున్నారు.
అదే విధంగా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఇంటి సమీపంలో 100మీటర్ల మేరకు నివాసాలను రెడ్జోన్లుగా ప్రకటించి ప్రతి ఒకరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కంటైన్మెంటు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యం, నేరుగా ఇంటింటికి తిరిగి అందజేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వం సూచించిన విధానాలు పాటిస్తే కరోనా కట్టడి సులభంగా చేయవచ్చని పేర్కొంటున్నారు. 14 రోజలు పాటు ఎక్కువ కేసులు నమోదయ్యే కంటైన్మెంట్ జోన్లలో టెస్టులు పెద్ద ఎత్తున చేసి, పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన తరువాత ఆరెంజ్ జోన్గా ప్రకటించి స్దానిక ప్రజలు బయటకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తామని అధికారులు వివరిస్తున్నారు.