Monday, April 29, 2024

టీమిండియా చరిత్ర!

- Advertisement -
- Advertisement -

Team India won in fourth Test against England

నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఘన విజయం
50 ఏళ్ల నిరీక్షణకు కోహ్లీసేన తెర!
సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్

ఓవల్ : ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల విజయం సాధించి చరిత్ర సృష్టించింది. టీమిండియా నిర్ధేశించిన 368 పరుగుల ఛేదనకు దిగిన అతిధ్య జట్టు 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 5 టెస్టు మ్యాచ్ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్లు హసీబ్ హమీద్(63; 193 బంతుల్లో 6×4), రోరీ బరన్స్(50; 125 బంతుల్లో 5×4) అర్ధశతకాలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ జోరూట్(36; 78 బంతుల్లో 3×4) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా నిలవలేకపోయాడు. ఇక ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీస పోరాటం చేయకుండా పెవిలియన్ చేరడంతో భారత్ అద్భుత విజయం సాధించింది.

జడేజా మ్యాజిక్..

ఓవర్ నైట్ స్కోర్ 77/0తో ఐదవ రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. సరిగ్గా 100 పరుగుల వద్ద రోరీ బర్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగులో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బరన్స్.. ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ హసీద్ హమీద్ 55 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 48వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హమీద్.. మొహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ దాన్ని నేలపాలు చేయడంతో అద్భుత అవకాశం చేజారింది. ఇక క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న హిట్టర్ డేవిడ్ మలన్(5) త్వరగానే రన్ ఔటయ్యాడు.

రవీంద్ర జడేజా వేసిన 53వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తూ మలన్ రన్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ నిలకడగా ఆడాడు. దాంతో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. లంచ్ తర్వాత మూడో ఓవర్‌లోనే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న హమీద్ (63)ను జడేజా క్లీన్ బౌల్ చేశాడు. 141 పరుగుల వద్ద హమీద్ వికెట్ కోల్పోయిన ఆతిధ్య జట్టు 146 పరుగుల స్కోర్ వద్ద ఓలీ పోప్ (2) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. పోప్‌ను బుమ్రా బోల్ చేశాడు.

క్రిస్ వోక్స్ ఔట్‌తో విజయం ఖాయం..

193 పరుగుల వద్ద ఆ జట్టు కీలకమైన క్రిస్ వోక్స్ (18) వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో వోక్స్ ఎనిమిదవ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా చారిత్రక గెలుపుకు మరో రెండు వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజ్‌లో క్రెయిగ్ ఓవర్టన్ (5) ఉన్నాడు. వోక్స్ వికెట్ అనంతరం అంపైర్లు టీ విరామం ప్రకటించారు. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టు గెలవాలంటే ఇంకా 175 రన్స్ చేయాలి. బుమ్రా, జడేజా, ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

50 ఏళ్ల చరిత్ర..

ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా 50ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచిం ది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత టీమిండియా ఇక్కడ 8 మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) ఘోర పరాజయాలను చవి చూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది.

సంక్షిప్త స్కోర్లు

భారత్ మొదటి ఇన్నింగ్స్ : 191

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ : 290

భారత్ రెండో ఇన్నింగ్స్ : 466

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 2౧0

బుమ్రా సరికొత్త రికార్డు..

నాలుగో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 65వ ఓవర్ ఐదవ బంతికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఓలి పోప్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఖాతాలో 100వ వికెట్ చేరింది. బుమ్రా 24 మ్యాచుల్లో 100 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ జాబితాలో భారత కెప్టెన్ కపిల్ దేవ్ రెండో స్థానంలో ఉన్నాడు. కపిల్ 25 టెస్ట్ మ్యాచులలో 100 వికెట్లు తీశాడు. నాలుగో టెస్టు మ్యాచ్‌కు ముందు అత్యంత వేగంగా టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఓవల్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు వరకూ 23 టెస్టులాడి 22.62 సగటుతో 96 వికెట్లు పడగొట్టాడు జస్ప్రీత్ బుమ్రా. దాంతో 96 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (28 టెస్టుల్లో 100 వికెట్లు), సీనియర్ పేసర్ మొహ్మద్ షమి(29 టెస్టుల్లో 100 వికెట్లు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News