Monday, April 29, 2024

సహాయ చర్యలకు సైనిక బృందం

- Advertisement -
- Advertisement -

Telangana CS speaks to Army officials for assistance

వరద ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలపై సిఎస్ సమీక్ష
భద్రాచలానికి హెలీకాఫ్టర్ , అదనపు రక్షణ సామగ్రి

హైదరాబాద్ : భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయంగా భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యల లలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరగా 68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ, 10 మంది సభ్యులు గల వైద్యబృందం, 23 మంది సభ్యులు గల ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రాది కొత్తగూడెం జిల్లాకు రానున్నారని వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలుగా ఉన్న ఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు, ఐదుగురు జెసిఓలు, 92 మంది వివిధ ర్యాంకుల వారున్నారని సిఎస్ తెలిపారు. సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక బోట్‌లను సిబ్బందితో సహా భద్రాద్రి జిల్లాకు పంపామని తెలిపారు.

అగ్నిమాపక విభాగానికి చెందిన ఏడు బోట్ లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది స్విమ్మర్లు ఇప్పటికే అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సింగరేణి కాలరీలు ఎండి శ్రీధర్‌లను ప్రత్యేక అధికారిగా నియమించామని సోమేశ్ కుమార్ అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ పునరావాస చర్యలకు ఉపయోగించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, భద్రాది కొత్తగూడెం జిల్లాలతో పాటు ములుగు, భూపాల పల్లి, పెద్ద పల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

భద్రాచలానికి హెలీకాఫ్టర్ , అదనపు రక్షణ సామగ్రి..
భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, ఇప్పటికే సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సిఎం ఆదేశాల మేరకు, స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములౌతున్నారు. భారీ వరదలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. ఈ ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని, రెస్కూ టీంలు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా వుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని యంత్రాంగం కాపాడుతున్నది.

మంత్రి అజయ్ అభ్యర్థన మేరకు..
భధ్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు., తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News