Friday, May 17, 2024

గన్‌పార్క్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా గన్‌పార్క్ వద్ద బిజెపి, బిఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలు, పోటాపోటీ నినాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు వర్గాలు తెలంగాణ అమరవీరుల స్మారకం సాక్షిగా ఆధిపత్య ధోరణితో కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసుల రంగప్రవేశంతో వారిని సర్దిచెప్పి పరిస్థితిని శాంతింపజేశారు. తెలంగాణ అవతరణ ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద ఇరుపార్టీల నాయకులు, బిజెపి కార్పొరేటర్లు, నేతలు నివాళులర్పించేందుకు వచ్చారు. తమ పార్టీల జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు.

బిజెపి వర్గాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కాదు దోపిడీ, దగా వేడుకలంటూ నినాదాలు చేస్తూ బిఆర్‌ఎస్ నేతలను రెచ్చగొట్టారు. దీనికి ప్రతిగా బిఆర్‌ఎస్ శ్రేణులు జై కెసిఆర్, జై తెలంగాణ అంటూ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలతో బదులిచ్చారు. రెండువర్గాలు దగ్గరుకు వచ్చేసి వాగ్వావాదాలు, తోపులాటలతో పోటాపోటీగా నినాదాలు మిన్నంటాయి. బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ రెండు చేతులకు సంకేళ్లు వేసుకుని వినూత్న తరహా నిరసనకు దిగారు. తెలంగాణలో దోపిడీ, కుటుంబ పాలన సాగుతోందని, ప్రతి దాంట్లో అవినీతి, చేతివాటంతో ప్రజల సొమ్మును దోచుకుని దాచుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు అధికార పదవులు అనుభవిస్తున్నారన్నారు. నిజమైన పోరాటవాదులకు బేడీలు వేసి జైళ్లకు పంపుతున్నారన్నారు.

బిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడిచేసేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. తోపులాటలు, వాగ్వావాదాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. వారిని నచ్చచెప్పేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ తెలంగాణలో తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ కుటుంబపాలనలో అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని, ప్రతి దీంట్లో చేతివాటం కోట్ల రూపాయల ప్రజా సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పోలీసులు జోక్యంతో చేసుకుని ఇరువర్గాల బయటికి పంపించడంతో పరిస్థితి శాంతించింది. గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు చెందిన బిఆర్‌ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఊరేగింపుతో గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అమరవీరుల కట్టడం వద్ద పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. జై తెలంగాణ, జై కెసిఆర్ అంటూ నినాదాలతో హోరెత్తాయి. తెలంగాణ న్యాయవాదులు, ఉద్యమకారులు అమరవీరులకు ఘనంగా నివాళుల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News