మనతెలంగాణ/హైదరాబాద్: తిరుమల శ్రీవారి లడ్డూలపై కరోనా ఎఫెక్ట్ పడింది. భక్తుల దర్శనం రద్దుతో లడ్డూల అమ్మకం నిలిచిపోయింది. ఈ క్రమంలో దాదాపు 2 లక్షల లడ్డూలు కౌంటర్లలో మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన లడ్డూలను టిటిడి పరిపాలన భవనం, స్విమ్స్కు తరలించింది. వీటిని టిటిడి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచితంగా ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి పది లడ్డూల చొప్పున అధికారులు అందజేశారు. మరోవైపు కరోనా నేపథ్యంలో భక్తుల రాకపోకలపై టిటిడి నిషేధం విధించింది. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కరోనా లక్షణాలు బయటపడడంతో భక్తుల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నామని స్వామివారికి పూజలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు తిరుమలను టిటిడి అధికారులు శుభ్రం చేయన్నురు. ఇందులో దాదాపు 300మంది టిటిడి అధికారులు, సిబ్బంది పాల్గొనబోతున్నారు.
Tirumala Srivari Laddus for free to Temple employees