Saturday, April 27, 2024

సికింద్రాబాద్ బోనాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష

- Advertisement -
- Advertisement -

TS Ministers review meeting on Secunderabad Bonalu

 

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల భాగమైన బోనాలు నాడు హైదరాబాద్, సికింద్రాబాద్‌కు పరిమితం కాగా, నేడు ఈ ఉత్సవాలు విశ్వవ్యాప్తమైయ్యాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అన్నారు. ఈ నెల 17 వ తేదీన జరిగే సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. సికింద్రాబాద్ బోనాలు, జాతర ఏర్పాట్లపై శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మంత్రులు అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కారణంగా నిర్వహించలేదని తెలిపారు. ఈ సంవత్సరం బోనాలను ఘనంగా నిర్వహించాలన్న సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు.

అంతేకాకుండా బోనాల ఉత్సవాల సందర్భంగా రూ.100 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని వివరించారు. గతంలో కంటే ఈ సంవత్సరం బోనాల కు అత్యధిక స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోనాలు, జాతర సందర్భంగా 1500 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నసిసికెమెరాలకు అదనంగా మరికొన్ని కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈవ్ టీజింగ్ నివారణ కు ప్రత్యేక షీ టీంలను కూడా నియమించనున్నట్లు వెల్లడించారు. జలమండలి ఆధ్వర్యంలో భక్తుల కోసం 6 లక్షల వాటర్ ప్యాకెట్ లు, 25 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో వైద్య శిభిరాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్, స్కౌట్ గైడ్ వారు అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు ఏర్పాట్లపై చేసిన సూచనలకు స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు ఎంతో గొప్ప పండుగ అని, దీనిని ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. బోనాల ఉత్సవాలకు గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్, జలమండలి ఎండి దానకిశోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, నార్త్ జోన్ డిసిపి చందన దీప్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఆర్‌డిఒ వసంత కుమారి, మహంకాళి దేవాలయ ఈఓమనోహర్ రెడ్డి, కార్పొరేటర్ లు సుచిత్ర, మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, మహంకాళి ఎసిపిరమేష్, ట్రాపిక్ అడిషనల్ డిసిపి రంగారావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిసి ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, జలమండలి జిఎం రమణారెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ పద్మనాభరావు, ఐ అండ్ పిఆర్ రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ జయరాం మూర్తి, దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్ తదితర సేవాసంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News