Monday, April 29, 2024

రెండు వరుసల రింగురోడ్డు సిద్ధిపేటకు వరం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

Two Lines Ring Road in Siddipet

సిద్దిపేట: రెండు వరుసల రింగురోడ్డు సిద్ధిపేటకు వరంగా మారిందిని, సిద్ధిపేట మెడలో హారంలా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ లో ఆర్అండ్ బీ రింగు రోడ్డు నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం సిద్ధిపేట నియోజకవర్గంలో బుస్సాపూర్ నుంచి తిమ్మాయిపల్లి వరకూ సింగిల్ రింగు రోడ్డును ఆనాడే కేసీఆర్ వేయించారని, సిఎం కెసిఆర్ ముందుచూపు వల్లనే ఇది సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. రెండు వరసలు రింగురోడ్డు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాజీవ్ రహదారి టూ రాజీవ్ దహదారిని అనుసంధానం చేసుకుంటూ సిద్ధిపేట చుట్టూ వలయంగా రింగ్ రోడ్డు ఎంతగానో దోహదపడుతుందని, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సిద్ధిపేటకు రావాల్సిన లేకుండా ఈ రెండు వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. మొత్తం 88 కిలో మీటర్ల మేర రూ.160 కోట్లతో రింగురోడ్డు వేస్తున్నామని, ఈ రింగు రోడ్డు వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. 7 మండలాలు కొండపాక, తొగుట, దుబ్బాక, సిద్ధిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూరు పరిధి మీదుగా 88 కిలో మీటర్ల విస్తరణ రింగురోడ్డు నిర్మాణం ఉండనుందని చెప్పారు.

ఈ రింగురోడ్డులో 12 గ్రామాలు బుస్సాపూర్, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మాచాపూర్, చిన్నకోడూర్, రామునిపట్ల, గోనెపల్లి, ఓబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, బందారం గ్రామాల మీదుగా ఈ రెండు వరసలు రహదారి నిర్మాణం చేయనున్నారు. ఈ నూతన రింగు రోడ్డుతో సిద్దిపేటకు మరిన్ని పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందన్నారు. ఎంత కష్టం ఉన్నా సిఎం కెసిఆర్ రైతుల కోసం రైతుబంధు డబ్బులు వేస్తున్నారని, దేశంలో అన్నీ ప్రభుత్వాలు రైతుల వద్ద శిస్తు వసూలు చేస్తే.. రైతులకే పన్ను కట్టిన ఏకైక నాయకుడు సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. నీటి తీరువాను బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నాయని, బిజెపి ప్రభుత్వం మీటర్లు పెట్టమని రైతుల మెడకు ఉరితాడు పెడుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బావి దగ్గర మీటర్లు పెట్టి 4 శాతం ఎఫ్ఆర్ బిఎం నిధులు తెచ్చుకుంటుందన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం సిఎం కెసిఆఱ్ ఎఫ్ఆర్ బిఎం కింద తెలంగాణకు వచ్చే రూ.25 వేల కోట్లు వద్దనుకున్నారన్నారు. రైతుల ప్రయోజనాలు ముఖ్యమని తేల్చిచెప్పారని, ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం వడ్లు కొనడంలేదని, కానీ తెలంగాణ ప్రజలను నూకలు తినమని పరిహాసం చేసిందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు టింగ్ టింగ్ మని ఫోన్లు మోగుతూ పడుతుంటే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News